అశ్వినీదేవతలు
@@@
ఇది భారతంలో చెప్పబడిన వృత్తాంతం.
సూర్యుని భార్య సంజ్ఞాదేవి. సూర్యుడు ఈమెతో రమించడానికి వచ్చినపుడు అతని తేజస్సును భరించలేకపోయేది. చివరకు ఒకరోజు ఇంటినుంచి కురుదేశానికి పారిపోయి అక్కడ ఒక ధనవంతుడి ఇంట్లో దాసిగా పనికి కుదిరి జీవితాన్ని సాగిస్తున్నది. సూర్యుడు గుర్రం రూపాన్ని ధరించి భార్యను వెతుక్కుంటూ వివిధ దేశాలను తిరుగుతూ ఒకరోజు కురుదేశాన్ని చేరుకొని తన భార్యను గుర్తించాడు. ఆమె కూడా అశ్వరూపంలో ఉన్న భర్తను గుర్తించింది. చాలా కాలం తరువాత ఆలుమగల సంయోగం కారణంగా ఇద్దరు కుమారులు జన్మించారు. సూర్యుడు అశ్వరూపంలో ఉండగా వీరి బీజం పడిన కారణంగా వీరికి అశ్వినులు అనే పేరు వచ్చింది. వీరి అసలు నామధేయాలు నాసత్యుడు, దస్రుడు.
వీరు అపూర్వ బుద్ధికుశలతతో పెరిగి అనేక వైద్యవిద్యలు అభ్యసించారు. వీరి నైపుణ్యం, ప్రతిభను గమనించిన దేవేంద్రుడు వీరిని దేవతలకు వైద్యుడుగా ఉండమని కోరడంతో వీరు దేవతల ఆస్థానవైద్యులు అయ్యారు.
ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే వీరు పురాణాల్లో తొలి శస్త్రవైద్యులు. అంటే చాలా పెద్ద సర్జన్లు. దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగినపుడు దేవతల కాళ్ళు, చేతులు విరిగినపుడు వీరు ఇనుముతో తయారు చేసిన కాళ్ళు, చేతులను దేహాలకు అమర్చేవారు.
చ్యవన మహర్షి వృద్ధాప్యంలో సుకన్యను వివాహం చేసుకున్నాడు. ఆమె భర్తపట్ల విరక్తురాలై ఉన్నపుడు దాన్ని గమనించిన అశ్వినులు చ్యవన మహర్షిని ఒక నదిలో స్నానం చేయించి యవ్వనవంతుడుగా మార్చారు.
****
పై కథలో మనం గ్రహించవలసిన రహస్యం ఏమిటి?
ఇవాళ కాళ్ళు, చేతులు కోల్పోయినవారికి కృత్రిమ అవయవాలు అమర్చడం మనం చూస్తున్నాము. ఆ విజ్ఞానం మన పురాణాలలోనే ఉన్నదని తెలియడం లేదూ? మన అపూర్వ విజ్ఞానం, వైద్యవిజ్ఞానం...ప్రతిభాపాటవాలు శతాబ్దాలతరబడి సాగిన పరాయి దేశస్తుల పాలనలో సర్వం విధ్వంసం అయిపొయింది. ఈరోజు చిన్న చిన్న సమస్యలకు కూడా విదేశాలు పరిగెత్తుతున్నాము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి