ss

ss
my

30, మే 2020, శనివారం

ఉపమన్యువు

ఉపమన్యువు 

       @@@

ఇది శివపురాణంలో ఒక ఘట్టం.  

ఉపమన్యువు ఒక బ్రాహ్మణ బాలుడు.   విధివశాత్తూ బంధువుల నిరాదరణకు గురైన ఇతని తల్లి ఇతడు పసిబాలునిగా ఉన్నప్పుడే ఒక అడవిని చేరుకొని అక్కడ చిన్న గుడిసెను నిర్మించుకుని జీవిస్తున్నది.  పసివాడు కావడంతో ఆకలితో ఏడ్చినప్పుడు అతనికి ఆహారం పెట్టలేక నీటిలో కొంచెం వరిపిండిని కలిపి పాల మాదిరిగా తయారుచేసి ఇచ్చేది తల్లి.  అయితే అవి రుచించక నాకు పాలు కావాలి అని మారాము చేస్తాడు ఉపమన్యువు.  "ఈ అడవిలో నేను పాలను ఎక్కడినుంచి తీసుకురాగలను?" విచారంగా చెప్పింది తల్లి.  

అపుడు ఉపమన్యువు "నేను పరమేశ్వరునికోసం తపస్సు చేసి పాలను సాధిస్తాను"  అని తపస్సుకు కూర్చుంటాడు.   చూస్తుండగా అది ఘోరతపస్సుగా మారుతుంది.   కైలాసంలో అగ్నిశిఖలు ఉద్భవిస్తాయి.   ఆ వేడికి మంచుకొండలు కరిగిపోతున్నాయి.   అపుడు పరమేశ్వరుడు దయతలచి ముందుగా ఈ బాలుడి చిత్తశుద్ధిని పరీక్షించాలనే అభిమతంతో ఇంద్రుని రూపంలో ప్రత్యక్షం అవుతాడు.  "ఏమి వరం కావాలో కోరుకో బాలకా" అంటాడు.  "నేను శివుని కోసం తపస్సు చేస్తున్నాను.   "నువ్వు అక్కర్లేదు వెళ్ళు" అని చెప్పి మళ్ళీ తపంలో మునిగిపోతాడు ఉపమన్యువు.  శివుడు నవ్వుతూ "నీకు వరం ఇవ్వడానికి ఎవరైతే ఏమి?  నీకు కావలసింది ఇస్తాను. కోరుకో. శివుణ్ణి మెప్పించడం చాలా కష్టం"  అంటాడు.  

 ఉపమన్యువు సమ్మతించక "నేను చేసే తపస్సు  మహాశివునికోసం మాత్రమే.  ఎంతకాలమైనా తపస్సు చేస్తాను.  నువ్వు వెళ్ళిపో" అని కమండలం నుంచి మంత్రజలాన్ని తీసుకుని చల్లుతాడు.  ఆ జలం దేహంపై పడగానే ఇంద్రుడి రూపం తొలిగిపోతుంది.  శివుడు నిజరూపంలో ప్రత్యక్షమై ఉపమన్యువు కోరుకొగానే పాలు పెరుగు సమృద్ధిగా లభించాలని వరం ప్రసాదించి అదృశ్యమై పోయాడు.  

***

పై కథనుంచి మనం తీసుకోవలసిన నీతి ఏమిటి?  

దేనికైనా పట్టుదల, కృషి, శ్రమ అవసరం.  ఏదైనా శ్రమించి సాధించాలి.  కష్టే ఫలి అన్నారు పెద్దలు.  మనలో కోరికలు ఉండవచ్చు.  కానీ, అవి మనముందుకు వచ్చి వాలిపోవు.  వాటిని సాధించడానికి మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలి.  గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే దీపం వెలగదు.  ఇక్కడ శివుడిని ఒక దేవుడిగా చూడరాదు.  మన శ్రమ, కృషి లో చిత్తశుద్ధి ఉంటే దయగల ధర్మాత్ములు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తారు.  

ఏదీ తనంత తానై నీ దరికి రాదు 
శోధించి సాధించాలి 
అదియే ధీరగుణం 

అంటారు మహాకవి శ్రీశ్రీ

27, మే 2020, బుధవారం

ఉత్తముడు

ఉత్తముడు 

                @@@

ఇది మార్కండేయపురాణంలో చెప్పబడిన విలువైన నీతి కథ.  

ఉత్తానపాదుడు-సురుచి అనే రాజ దంపతులకు జన్మించాడు. ధ్రువుడికి సవతి సోదరుడు.  యితడు పెద్దయ్యాక బహుళ అనే ఒక అందగత్తెను పెళ్లి చేసుకున్నాడు.  కానీ ఆమెకు ఇతనంటే చిన్న చూపు.  ఇతని మాటలను లక్ష్యపెట్టేది కాదు.  ఒకనాడు రాజబంధువులు పదిమంది కూర్చుని విందు ఆరగిస్తున్నపుడు ఉత్తముడు ఒక గ్లాసులో మధువును నింపి భార్యకు ఇవ్వబోగా ఆమె తిరస్కరించింది.  నలుగురిలో తనను అవమానించిందని ఆగ్రహించి భటులను పిలిచి ఆమెను అడవుల్లో వదిలేసి రమ్మని ఆజ్ఞాపించాడు.  ఇష్టం లేని భర్తతో కాపురం కన్నా, అడవుల్లో జీవితమే ఉత్తమని ఆమె కూడా ఆవేశంలో పతిని తూలనాడి భటులతో వెళ్ళిపోయింది.   అంతటి అందమైన, కోరి చేసుకున్న  భార్యను ఆవేశంలో  అడవులకు పంపినందుకు ఏమాత్రం సిగ్గుపడలేదు ఉత్తముడు.  

కొంతకాలం తరువాత ఉత్తముడి కొలువుకు సుశర్మ అనే వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తన భార్యను ఎవరో అపహరించారని, ఆమెను తనకు తెచ్చి ఇవ్వమని ఫిర్యాదు చేశాడు.  ఆమె ఎలా ఉంటుందని అడిగాడు ఉత్తముడు.  నల్లగా, పొట్టిగా, వికారంగా, వృద్ధాప్యపు ఛాయలతో ఉంటుందని చెప్పాడు సుశర్మ.   ఉత్తముడు పెద్దగా నవ్వి "అలాంటి భార్య పోయిందని ఆనందించక  ఏడుస్తావెందుకు?  సంతోషించు?"  అన్నాడు హేళనగా.   పురుషుడు ఒకసారి ఒక కన్యను వివాహం చేసుకున్న తరువాత ఆమె కుంటిదైనా, గుడ్డిదైనా జీవితాంతమూ ప్రేమించాలని, యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె మన కోరికలు అన్నీ తీర్చడమే కాక, పిల్లలను కని, పెంచి, పెద్దచేసి, మన వంశాన్ని నిలబెట్టిందనే సత్యాన్ని మరువకూడదని, భార్య భార్యేనని చెబుతాడు సుశర్మ.

ఆమెను వెతకడం కోసం ఉత్తముడే స్వయంగా అడవులకు వెళ్తాడు.  దారిలో దాహమై ఒక ముని ఆశ్రమానికి వెళ్లి తాను ఆ దేశానికి రాజును అని పరిచయం చేసుకుని కాసిని మంచినీళ్లు ఇమ్మని అడుగుతాడు.  ఒక శిష్యుడు గ్లాసుతో మంచినీరు తెచ్చి రాజు చేతికి ఇవ్వకుండా  దూరంగా నేలమీద పెడతాడు.  ఉత్తముడు ఆశ్చర్యపోయి తాను మహారాజును అని తెలిసీ కూడా అగౌరవంగా గ్లాసును  నేలమీద ఎందుకు ఉంచావు అని ప్రశ్నిచాడు.  భార్యావిహీనులు మునులనుంచి అర్ఘ్యపాద్యాదులు స్వీకరించడానికి అనర్హులు అని బదులిస్తాడు ముని.  

ఉత్తముడు బాధపడి తాను ఒక మహిళకు వెతుకుతున్నాను అని చెపుతాడు.  అపుడు ముని తన దివ్యదృష్టితో పరిశీలించి ఒక రాక్షసుడు ఆమెను తీసుకెళ్లి బంధించాడు అని ఆ వివరాలు చెబుతాడు.  దాని ప్రకారం ఉత్తముడు వెళ్లి రాక్షసుని కలిసి " బ్రాహ్మణ స్త్రీని ఎందుకు ఎత్తుకొచ్చావు?" అని ప్రశ్నించగా " సుశర్మ రాక్షసంహారం కోసం యాగం చేస్తున్నాడు.  భార్య లేనివాడు యాగానిర్వహణకు అనర్హుడు కాబట్టి ఆమెను ఎత్తుకొచ్చాను"  అని బదులిస్తాడు. భార్య యొక్క విలువ ఏమిటో గ్రహించిన   ఉత్తముడు పశ్చాత్తాపం చెంది  రాక్షసుని ఒప్పించి ఆమెను స్వాధీనం చేసుకుని తన భార్య ఎక్కడుందో చెప్పమని వేడుకుంటాడు.  రాక్షసుడు ఆమెను ఒక వనరాక్షసుడు అపహరించాడని చెప్పగా ఉత్తముడు సుశర్మ భార్యతో సహా ఆ ప్రాంతానికి వెళ్లి తన భార్యను తిరిగి తెచ్చుకుంటాడు.  

****

పై కథలోనుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

సంసారం అంటే ఒక్క భర్త మాత్రమే కాదు.  భర్త సంపాదించి కుటుంబాన్ని పోషిస్తాడు అనేది నిజమే కావచ్చు (ఒకప్పటి మాట సుమా!)  కానీ, భార్య అనేది కూడా ఒక పదవి.  మహారాజు పదవి ఎలాంటిదో, మహారాణి పదవి కూడా అలాంటిదే.  రాజుకు ఉన్నట్లే మహారాణికి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. భార్య అంటే భర్త కింద అణిగిమణిగి పడి ఉండే దాసీ కాదని మన పురాణాలు ఏనాడో గుర్తించాయి.  అందుకే భార్యలేనివాడు పూజలకు, యాగాలకు అనర్హుడుగా ప్రకటించారు మన మహర్షులు.  ఎందుకంటే మగవాడు తన బుద్ధిని వక్రమార్గం పట్టించకుండా, భార్యను కాపాడుకోవాలని, ఆమె లేని జీవితం వ్యర్థమని పై గాధ మనకు బోధిస్తున్నది.

21, మే 2020, గురువారం

అశ్వినీదేవతలు

అశ్వినీదేవతలు 

                 @@@

ఇది భారతంలో చెప్పబడిన వృత్తాంతం.

సూర్యుని భార్య సంజ్ఞాదేవి.  సూర్యుడు ఈమెతో రమించడానికి వచ్చినపుడు అతని తేజస్సును భరించలేకపోయేది.  చివరకు ఒకరోజు  ఇంటినుంచి కురుదేశానికి  పారిపోయి  అక్కడ ఒక ధనవంతుడి ఇంట్లో దాసిగా పనికి కుదిరి జీవితాన్ని సాగిస్తున్నది.  సూర్యుడు గుర్రం రూపాన్ని ధరించి భార్యను వెతుక్కుంటూ వివిధ దేశాలను తిరుగుతూ  ఒకరోజు కురుదేశాన్ని చేరుకొని తన భార్యను గుర్తించాడు.  ఆమె కూడా అశ్వరూపంలో ఉన్న భర్తను గుర్తించింది.  చాలా కాలం తరువాత ఆలుమగల సంయోగం కారణంగా ఇద్దరు కుమారులు జన్మించారు.  సూర్యుడు అశ్వరూపంలో ఉండగా వీరి బీజం పడిన కారణంగా వీరికి అశ్వినులు అనే పేరు వచ్చింది.  వీరి అసలు నామధేయాలు నాసత్యుడు, దస్రుడు.  

వీరు అపూర్వ బుద్ధికుశలతతో పెరిగి అనేక వైద్యవిద్యలు అభ్యసించారు.  వీరి నైపుణ్యం, ప్రతిభను గమనించిన దేవేంద్రుడు వీరిని దేవతలకు వైద్యుడుగా ఉండమని కోరడంతో వీరు దేవతల ఆస్థానవైద్యులు అయ్యారు.  

ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే వీరు పురాణాల్లో తొలి శస్త్రవైద్యులు.  అంటే చాలా పెద్ద సర్జన్లు.  దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగినపుడు దేవతల కాళ్ళు, చేతులు విరిగినపుడు వీరు ఇనుముతో తయారు చేసిన కాళ్ళు, చేతులను దేహాలకు అమర్చేవారు.  

చ్యవన మహర్షి వృద్ధాప్యంలో సుకన్యను వివాహం చేసుకున్నాడు.  ఆమె  భర్తపట్ల విరక్తురాలై ఉన్నపుడు దాన్ని గమనించిన అశ్వినులు చ్యవన మహర్షిని ఒక నదిలో స్నానం చేయించి యవ్వనవంతుడుగా మార్చారు.  

 ****

పై కథలో మనం గ్రహించవలసిన రహస్యం ఏమిటి?

ఇవాళ కాళ్ళు, చేతులు కోల్పోయినవారికి కృత్రిమ అవయవాలు అమర్చడం మనం చూస్తున్నాము.  ఆ విజ్ఞానం మన పురాణాలలోనే ఉన్నదని తెలియడం లేదూ?  మన అపూర్వ విజ్ఞానం, వైద్యవిజ్ఞానం...ప్రతిభాపాటవాలు శతాబ్దాలతరబడి సాగిన పరాయి దేశస్తుల పాలనలో సర్వం విధ్వంసం అయిపొయింది.  ఈరోజు చిన్న చిన్న సమస్యలకు  కూడా విదేశాలు పరిగెత్తుతున్నాము.

18, మే 2020, సోమవారం

భాగవతం -- 2

భాగవతం -- 2

మొట్టమొదటిది అయిన ఋగ్వేదమును పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు. యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదమును సుమంతువు అనే ఋషికి తెలియజేశారు. ఈ పదునెనిమిది పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సూతుడు. సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు.

పురాణ వాజ్ఞ్మయమునంతటిని కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సూతుడు, రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతమును మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడు. ఆయన పుట్టుకచేతనే అపారమయిన జ్ఞాన వైరాగ్యములు, భక్తి కలిగినవాడు. ఎంత వైరాగ్య భావన కలిగినవాడు అంటే – ఆయన మంచి నిండు యౌవనములో ఉండే రోజులలో తండ్రిగారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు వివాహం అక్కరలేదు...ఈలోకం అంతా దుఃఖభూయిష్టమయిపోయింది. నేను ఆనందమును అనుభవించాలి. అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను’ అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనకనుంచి వ్యాసుడు పుత్రునిమీద వున్న కాంక్షచేత ‘హాపుత్రా హాపుత్రా’ అని అరుస్తూ వెంటవస్తున్నారు. శుకుడు ‘ఓయ్’ అనలేదు. అంతటా ఆత్మతత్త్వమును చూడడానికి అలవాటయిపోయిన శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యములో వున్న చెట్లు అన్నీ ‘ఓయ్ ఓయ్’ అని జవాబు చెప్పాయి. అంతటి బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడై యౌవనమునందే ఒంటిమీద బట్టలేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు.

శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్కనుంచి వెళ్ళిపోతున్నారు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. అక్కడి సరోవరంలో అప్సరసలు దిగంబరముగా  స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు. శుకబ్రహ్మకు వచ్చి నమస్కారం చేయాలని వారు వివస్త్రలుగానే   ఒంటిమీద వస్త్రం కట్టుకోకుండా లేచివచ్చి శుకునికి నమస్కరించారు. అపుడు శుకుడు నిండు యౌవనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్సరసలు స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించండి అన్నారు. అపుడు వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించారు. ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. ‘నా కుమారుడు యౌవనంలో ఉన్నాడు. నేను వార్ధక్యమునందు ఉన్నాను. నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు. నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి ఈ తేడా’ అని వ్యాసుడు అప్సరసలను అడిగారు. అడిగితే అప్సరసలు అన్నారు – ‘నీ కుమారునికి స్త్రీ పురుష భేదము తెలియదు. అతడు అంతటా బ్రహ్మమునొక్కదానిని మాత్రమే చూస్తాడు. నీకు స్త్రీపురుష భేదము తెలుసు. అందుకే నీకు మేము బట్టలు కట్టుకొని నమస్కరించాము’ అని బదులు చెప్పారు. అదీ శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తి అంటే!

శుకుడు చాలా గొప్పవాడు. అందుకే ఒక్క భాగవతమును మాత్రం వ్యాసుడు వేరోకరిచేత చెప్పించకుండా శుకునిచేత మాత్రమే చెప్పించారు. భాగవతం చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్ధత చూశాడు. ‘కుశ’ అంటే దర్భ. దర్భ చేతిలో పట్టుకున్నంత సేపు కర్మాచరణం చేస్తాడు. కర్మాచరణం ఎందుకు చేస్తారంటే – కర్మ చేయగా చేయగా ఇంటిని తుడుచుకుకుని తుడుచుకుని బూజులన్నీ దులుపుకుని పండగ వచ్చే ముందు శుభ్రపరుపబడిన ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చెయ్యగా చెయ్యగా లోపల ఉండేటటువంటి మనస్సుకు పట్టిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చొనడానికి, సత్కర్మాచరణమును పూనికతో సంతోషముతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధియందు ఆనందప్రదమయిన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దానివలన జ్ఞానము కలుగుతుంది. జ్ఞానముచేత మోక్షము కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేదానికి దర్భలతో సంబంధం ఉంది. తిరగేస్తే – ‘శుక’ అయింది. అంటే ఇప్పుడు ఆయనకు కర్మాచరణము లేదు. అనగా ఆయన కర్మాచరణమును కావాలని మానినవాడు కాదు. ఆయన చెయ్యడానికి కర్మలేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడు. ఆయన నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. బ్రహ్మము తప్ప వేరొక వస్తువు ఆయనకు తెలియదు ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు. బ్రహ్మముతో కలిసిఉంటాడు. బ్రహ్మమును పొందుతూ ఉంటాడు. ఇంత ఆనందస్థితిని అనుభవించే వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయన ‘కౌపీనపంచకము’ అని ఒక పంచకము చేశారు. అందులో – ‘అసలు కౌపీనము పెట్టుకున్న వాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ వున్నాడు’ అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగియై ఈశ్వరుని పాదారవిందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వానికి ఇంద్రపదవి లభించినా సరే దానిని తిరస్కరిస్తాడు. తనకు అక్కర్లేదు అంటాడు. ఇందులోనే తనకు తృప్తి ఉన్నది అంటాడు.

అటువంటి మహానుభావుడయిన శుకుడు నిరంతరమూ ఆనందమును అనుభవించేవాడు. ఆయన ఏదయినా ఒక ప్రదేశమునకు వస్తే ఒక ఆవుపాలు పితకడానికి ఎంతసమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు వాడు కాదు. ఎందుకు? ఒకవేళ ఎక్కడయినా అంతకన్నా ఎక్కువసేపు నిలబడితే ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడితే ఆ పరిచయం వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి, వీరు ఫలానా వీరు ఫలానా అని గుర్తుపెట్టుకొని వీళ్ళందరినీ లోపలపెట్టుకుంటే ఈశ్వరుడితో సంగమము తగ్గిపోయి లోకముతో సంగమం పెరిగిపోతుందని ఆయన ఎక్కడా ఎక్కువసేపు ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి కూర్చుని ఏడురోజులు భాగవతములు ప్రవచనము చేశాడు.

16, మే 2020, శనివారం

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- జ



* జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
* జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది
* జన్మకో శివరాత్రి అన్నట్లు
* జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
* జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
* జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
* జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే
* జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
* జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
* జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
* జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- బ



* బతకలేక బడి పంతులని
* బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట
* బతికి పట్నం చూడాలి...చచ్చి స్వర్గం చూడాలి
* బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టినట్టు
* బ్రతికుంటే బలుసాకు అమ్ముకుని బతకొచ్చు
* బ్రతికుంటే బలుసాకు తినొచ్చు
* బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు
* బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయం
* బుగ్గ గిల్లి జోల పాడటం
* బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు
* బెల్లం చుట్టూ ఈగల్లా
* బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట
* బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు

* బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు

* భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట
* భక్తిలేని పూజ పత్రి చేటు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- చ



* చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు
* చక్కనమ్మ చిక్కినా అందమే
* చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
* చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
* చదవేస్తే ఉన్న మతి పోయినట్లు
* చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
* చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
* చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
* చనిపోయిన వారి కళ్ళు చారెడు
* చల్లకొచ్చి ముంత దాచినట్లు
* చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు
* చాప క్రింది నీరులా
* చారలపాపడికి దూదంటి కుచ్చు
* చారాణా కోడికి భారాణా మసాలా
* చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
* చింత చచ్చినా పులుపు చావనట్టు
* చిత్తం చెప్పులమీద దృష్టేమో శివుడిమీద
* చిత్తశుద్ది లేని శివపూజలేల
* చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
* చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా!
* చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
* చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం
* చెడపకురా చెడేవు
* చెప్పేవాడికి వినేవాడు లోకువ
* చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
* చెముడా అంటే మొగుడా అన్నట్టు
* చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు
* చెవిలో జోరీగ
* చేతకాక మంగళవారమన్నాడంట
* చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
* చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
* చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు...
* చెరువు మీద అలిగి....స్నానం చేయనట్లు
* చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు

సుందర కాండ


సుందర కాండ

సుందరకాండ రామాయణంలో ఐదవ కాండ. హనుమంతుడు లంకా లంఘనానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు.

సుందరకాండములోని కొన్ని ఘట్టాలు - 1800 కాలం నాటి చిత్రం - ఇందులో సాగర లంఘనం, సీతా దర్శనం, లంకా దహనం చిత్రీకరింపబడినాయి

సుందరకాండ పేరు

వాల్మీకి మహర్షి అన్ని కాండలకు ఆయా కథాభాగానికి సంబధించిన పేర్లు పెట్టాడు. కాని సుందరకాండకు "సుందరకాండ" అని పేరు పెట్టడానికి గల కారణాలను పండితులు చాలా రకాలైన వివరణలు, వ్యాఖ్యానాలు చెప్పారు. ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత శ్లోకం దీనికి వివరణ ఇస్తుంది.

సుందరే సుందరో రామ:
సుందరే సుందరీ కథ:
సుందరే సుందరీ సీత
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరం?

సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథ ను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది?

అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు. కాని సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించక పోయినా, నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది.

మరొక అభిప్రాయం: "హనుమంతుడు" (వజ్రాయుధం వల్ల హనుమ, అనగా దవడ, కు దెబ్బ తగిలినవాడు), ఆంజనేయుడు (అంజనా దేవి కుమారుడు), మారుతి (వాయుదేవుని కొడుకు) వంటి పేర్లు హనుమంతుని జీవితంలో ఘటనలు లేదా సంబంధాల కారణంగా వచ్చాయి. అసలు హనుమంతుని పేరు "సుందరుడు" అని, ఆ కారణంగా వాల్మీకి ఈ కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టాడని అంటారు.

”"రామాయణమునందు తక్కిన కాండలకు తత్కాండాతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి విడిగా "సుందరకాండము" అను పేరు ఏల .. అను సంశయము పలుమందికి ఉంది. నేను సుమారు ముప్పది యేండ్లక్రింద కీ.శే. శ్రీ కాశీకృష్ణాచార్యులవారిని ఈ ప్రశ్న అడిగితిని. సుందర హనుమన్మంత్రమును మహర్షి వాల్మీకి ఈ కాండమున నిక్షేపించుట వలన ఆ పేరు వచ్చినది అని చెప్పిరి."” [1]

అయితే ఆ షోడశి రచనలోనే గుంటూరు శేషేంద్రశర్మ, పై వాదనలతో ఏకీభవించలేదు. "శ్రీ సుందరకాండకు ఆ పేరెట్లు వచ్చినది?" అనే అధ్యాయంలో రచయిత చెప్పిన కారణం - సుందరకాండ వాల్మీకి రామాయణానికి హృదయం. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధములో వసించును. కనుక ఇది సుందరకాండము. ఆది శంకరుని ప్రసిద్ధ మంత్రయుక్త స్తోత్రము సౌందర్య లహరిలోని "సౌందర్య" పదము ఈ భావములోనే వాడబడింది. బ్రహ్మాండ పురాణములో ఈ కాండము "సౌందర్య కాండము" అనియే చెప్పబడింది.[1]

సుందరకాండ సంక్షిప్త కథ

కిష్కింధ కాండ చివరిలో సీతాన్వేషణానికై దక్షిణదిశకు బయలుదేరిన బృందం ఎలాగో సాగర తీరానికి చేరుకొంటారు. నూరు యోజనాల అవతల రావణుని నగరం లంకలో సీత ఉండవచ్చునని సంపాతి ద్వారా తెలుసుకొంటారు. కాని సాగర తరణం సాధ్యమయ్యేది ఎలాగని హతాశులౌతారు. జాంబవంతుని ప్రేరణతో సాగరాన్ని తాను గోష్పాదం లాగా లంఘించగలనని హనుమంతుడు సన్నద్ధుడౌతాడు. అక్కడినుండి సుందరకాండ కథ మొదలౌతుంది.

హనుమంతుని సాగర తరణ

నాగమాత సురసతో మాట్లాడుతున్న హనుమంతుడు - 17వ శతాబ్దం నాటి చిత్రం

హనుమంతుడు పర్వత సమానంగా దేహాన్ని పెంచి, సాగరాన్ని దాటడానికి సన్నద్ధుడై మహేంద్రగిరిపైకి ఎక్కాడు. సూర్యునికి, ఇంద్రునికి, బ్రహ్మకు, భూతకోటికి నమస్కరించాడు. పిక్కలు బిగబట్టి, చేతులు అదిమి, ఒక్కుదుటున లంఘించాడు. అ అదురుకు పర్వతం బీటలు వారింది. ఆకాశంలో మేఘంలా, విడచిన రామబాణంలా, హనుమంతుడు వేగంగా లంకవైపుకు వెళ్ళసాగాడు.

రామ కార్యానికి సహాయపడదలచి, దారిలో మైనాకుడనేపర్వతం తనపై విశ్రాంతి తీసికోమని కోరాడు. ఆ ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి హనుమంతుడు ముందుకు సాగాడు. సురస అనే నాగమాత హనుమను పరీక్షింపదలచి, మృత్యుగహ్వరంలాంటి తన నోరు తెరచి అతని దారికి అడ్డు నిలచింది. యుక్తిగా ఆమె నోట ప్రవేశించి, మళ్ళీ బయటకు వచ్చి, ఆమె ఆశీర్వచనం పొంది హనుమంతుడు ముందుకు సాగాడు. సింహికఅనే ఛాయాగ్రాహక రాక్షసి హనుమంతుని నీడను పట్టి లాగసాగింది. హనుమంతుడు శరవేగంతో దాని కడుపులో దూరి, కడుపును చీల్చి వేసి, అప్రతిహతంమైన రామబాణంలా లంకలోని త్రికూటగిరి శిఖరంపై వాలాడు.

లంకా నగర ప్రవేశం

దూరంనుండి లంకానగరం శోభను, సౌందర్యాన్ని, సురక్షిత వ్యవస్థను చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. చీకటి పడిన తరువాత చిన్నపాటి దేహం దాల్చి నగరంలో ప్రవేశించబోయాడు. ద్వారం వద్ద లంకా నగరాధిదేవత లంకిణి అతనిని అడ్డగించిండి. హనుమంతుడు ఆమెను దండించాడు. అతడు కారణజన్ముడనీ, బ్రహ్మ చెప్పిన విధంగా లంకకు కీడు వాటిల్లనుందనీ లంకిణి గ్రహించింది. ద్వారం గుండా కాకుండా ప్రాకారాన్ని లంఘించి, ఎడమ కాలు ముందుంచి, హనుమంతుడు మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు. ఆ సమయంలో చంద్రోదయం జరిగి, లంకానగరం మరింత శోభాయమానం అయింది.

అంతఃపురంలో సీతాన్వేషణ

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణునిమందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ .. అన్నిచోట్లా సీతను వెదకాడు. రాత్రి వేళ రావణుని మందిరంలో కాంతలు భోగ లాలసులై, చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు, తాను రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకూ లోను గాకుండా సీతాన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక నిమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టం లేదు. తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామ లక్ష్మణులు, మరెందరో హతాశులౌతారని వగచాడు. ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు. సీత కనుపించకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.

నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ప్రార్థించాడు. దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చవలెనని కోరాడు. బ్రహ్మ, అగ్నివాయుదేవుడుఇంద్రుడువరుణుడుసూర్యచంద్రులుఅశ్వినీ దేవతలు, మరుత్తులు, శివుడు, సకల భూతములు, శ్రీమహావిష్ణువు తనకు కార్యసిద్ధి కలిగించవలెనని ప్రార్థించి సీతాన్వేషణకై అశోకవనంలో అడుగుపెట్టాడు.

అశోకవనంలో సీతమ్మ దర్శనం

అశోక వనములో సీతను చూచిన హనుమంతుడు

అశోకవనం అనన్య సుందరమైనది. అందులో చక్కని వృక్షాలు, పూలు, చిత్ర విచిత్రములైన కృతక పర్వతాలు, జలధారలు ఉన్నాయి. మణిమయాలైన సరస్సులున్నాయి. అద్భుతమైన చైత్య ప్రాసాదములున్నాయి. వాటిలో అతి మనోహరమైన ఒక శింశుపా వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు చుట్టుప్రక్కల పరిశీలింపసాగాడు.

అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన ఒక స్త్రీని చూచాడు. ఆమె ఏకవస్త్రయై, ధూమావృతమైన అగ్ని శిఖవలె, మిధ్యాపవాదువలన భంగపడిన కీర్తివలె, మేఘాచ్ఛాదితమైన చంద్రబింబంవలె ఉంది. ఆమె ధరించిన ఆభరణాలు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలచుకొని, కాలం ఎంతటివారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకొని, హనుమంతుడు దుఃఖించాడు.

త్రిజటాస్వప్నం

అశోకవనంలో సీతను రావణుడు బెదిరించడం - 16వ శతాబ్దం నాటి చిత్రం

అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి సీతను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డముగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. పోగాలము దాపురించినందువల్లనే ఈ నీచ సంకల్పము అతనికి కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మమగుట తథ్యమని రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది.

వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది -

అశోక వనములో ఉన్న సీతకు ఆహారాన్ని అందిస్తున్న ఇంద్రుడు

"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత, వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.

"ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి, పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచుంన్నది. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలము త్రాగుచు, పిచ్చివారివలె లంకలో గంతులు వేయుచున్నారు."

ఇలా చెప్పి త్రిజట తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

శ్రీరామ వర్ణన

సీత హనుమంతునికి చూడామణిని ఇచ్చుట

చెట్టుపైనుండి ఇదంతా గమనించిన హనుమంతుడు ఇంక ఆలస్యము చేసినచో సీత ప్రాణత్యాగము చేయగలదని ఊహించాడు. కాని ఒక్కమారుగా ఆమెకు కనిపించినట్లయితే ఆమె ఖంగారుపడి కేకలు వేయవచ్చనీ, అలాగయితే అసలు పని చెడుతుందని భావించాడు. చెట్టుపైనుండి మెల్లగా దశరథ కుమారుడైన రాముని కథ చెప్పనారంభించాడు. ఆ రాముడు సీతను వెదకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి, చెట్టుపైనుండి, సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమ పడింది. తల పైకెత్తి, మెరుపు తీగవలె, అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, బృహస్పతికి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగివచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతకు తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

హనుమంతుడు భక్తితో అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించాడు. "రాముడు ఆజానుబాహుడు. కమల పత్రాక్షుడు. రూప దాక్షిణ్య సంపన్నుడు. శుభలక్షణములు గలవాడు, తేజోమూర్తి, ధర్మ రక్షకుడు, సర్వ విద్యాపారంగతుడు, లోకమర్యాదలను పాటించువాడు. సమ విభక్తములైన శరీరాంగములు కలవాడు. దీర్ఘములైన బాహువులు, శంఖమువంటి కంఠము, కండరములతో మూసుకొనిఫోయిన సంధి యెముకలు కలవాడు. మూడు దృఢమైన స్థానములు, మూడు దైర్ఘ్యముగల అవయవములు, మూడు సమ అవయవములు, మూడు ఎఱ్ఱని ఆవయవములు కలవాడు. పదునాలుగు సమమైన అవయవములు కలవాడు. నాలుగు విధములైన నడక గలవాడు. ఉత్తముడు, వీరుడు. నల్లనివాడు. అతని తమ్ముడు లక్ష్మణుడు అట్టి శుభలక్షణములే కలిగి, ఎర్రని మేని ఛాయ గలవాడు - అట్టి రామలక్ష్మణులు నీకై పరితపించుచున్నారు. సుగ్రీవునితో చెలిమి జేసి, నిన్ను వెదులుటకై నలు తెరగుల వానరులను పంపియున్నారు. ఓ సీతా దేవీ! త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచటనుండి తీసికొని పోనున్నాడు" - అని హనుమంతుడు చెప్పాడు.


హనుమంతుడికి చూడామణిని ఇస్తున్న సీత

శ్రీరాముని గురించి విని, సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసికొని వెళ్ళగలనని కోరాడు. సీత హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని స్వయంగా శ్రీరాముడే వచ్చి, రావణుని పరిమార్చి, తనను తీసికొని వెళ్ళాలని చెప్పింది. రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది. ఆ మహాంబుధిని దాటడం (హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు తప్ప) ఇతరులకు ఎలా శక్యమని సంశయించింది.

అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి (యుద్ధానికి కాదు) పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి సూర్య చంద్రుల వలె, అగ్ని వాయువులవలె లంకను వాశనం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమెను అనునయించాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.

రాక్షసులను దండించడం

అశోక వనములో రాక్షసులతో ఘర్షణ పడుతున్న హనుమంతుడు

సీతా దర్శనంతో సంతుష్టుడైన హనుమంతుడు ఇక పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. అలా చేయడం వల్ల రావణుని హెచ్చరించడానికీ, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికీ వీలవుతుంది. అంతే గాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలయినంత నష్టం కలిగించవచ్చును. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ ధ్వంసం చేసి మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.

ఆ కపిని బంధించమని రావణుడు ఎనుబదివేల మంది సైన్యాన్ని పంపాడు. హనుమంతుడు - జయత్యతిబలో రామో, లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో, రాఘవేణాభిపాలితః, దాసోహం కోసలేంద్రస్య, రామస్యా క్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాత్మజః అని జయఘోష చేశాడు - మహా బలవంతుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన కిష్కింధ ప్రభువు సుగ్రీవునకు జయము. నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. వేయి మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోను, వృక్షాలతోను సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. నా పని ముగించుకొని, సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురు గాక - ఇలా గర్జిస్తూ హనుమంతుడు ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాదము యొక్క ఒక పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.

అప్పుడు రావణుడు, ప్రహస్తుని కుమారుడు మహా బలశాలీ అయిన జంబుమాలిని పంపాడు. హనుమంతుని చేతి పరిఘతో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అఱచేతితోను, కొందరిని ముష్టిఘాతాలతోను, కొందరిని తన వాడిగోళ్ళతోనూ చంపగా యుద్ధ భూమి అంతా శత్రువుల రక్త మాంసాలు చెల్లాచెదరయ్యాయి. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేత నిహతులైపోయారు. రణ భూమి అంతా రాక్షస, వాహన కళేబరాలతోను, ఆయుధ, రథ శకలాలతోను నిండిపోయింది.

హముమంతుని బంధించి తీసుకు వెళుతున్న ఇంద్రజిత్తు

ఇక దుర్ధరమైన ప్రతాపశాలి, వర సంపన్నుడు, గొప్ప రథము కలవాడును అయిన అక్షకుమారుడుసకలబలములతో హనుమంతుని సమీపించాడు. వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరచింది. వర్షంలాంటి అక్షకుమారుని బాణాలు హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత, గరుత్మంతుడు మహా సర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చేజిక్కించుకొని, గిరగిర త్రిప్పి వేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుగ్గునుగ్గయ్యింది.

ఈ సంగతి తెలిసిన రావణుడు కలవరపడి, పెక్కు జాగ్రత్తలు చెప్పి, ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు, ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్ర తంత్ర యుద్ధవిద్యానిపుణుడూను. అతడు తండ్రికి నమస్కరించి, రణోత్సాహంతో పొంగిపోతూ, సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవునిపట్ల గౌరవసూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా నటించాడు. ఆ విధంగా రావణునితో సంభాషించ దలచాడు. రాక్షస సేనలు హనుమంతుని బంధించి, బాధిస్తూ రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయారు.

రావణునితో సంవాదం

హనుమంతుని తోకకు నిప్పు అంటిస్తున్న రాక్షసులు c.1910's నాటి చిత్రం.

బ్రహ్మాస్త్రానికి వశుడైనట్లు నటించి, హనుమంతుడు రావణుని సభాభవనంలో ప్రవేశించి రావణుని చూశాడు. రావణాసురుని సభాప్రాంగణం మణిమయమై శోభిల్లుతున్నది. రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అనులేపనాదులు అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలియు, వీరుడును ఐన రావణుడు పది శిరస్సులతో ఒప్పుచు, అనేక కౄర మృగములతో నిండిన శిఖరములు గల మందరగిరి వలె ప్రకాశిస్తున్నాడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై కాటుక కొండవలె ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు. - ’ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!’

హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఎవరు పంపారు? - తెలిసికోమని రావణుడు మంత్రులకు ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు - రాజా! నేను సుగ్రీవుని మంత్రిని. రాముని దూతను. హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని సీతను తెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమై పోతుంది. వాలిని రాముడే సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని, మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకు, లంకకూ చేటు దాపురించింది. రాముడు మానవుడు. నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురియైనవానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు. - అని హితవు చెప్పాడు.

రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి - దూతను చంపడం రాజ ధర్మం కాదు. అంతే కాకుండా ఇతను తిరిగి వెళ్ళకపోతే నీను శతృవులతో యుద్ధం చేసి వారిని నిర్జించే అవకాశం కోల్పోతావు. కనుక, దండించి వదలమని సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి వూరంతా త్రిప్పమని ఆనతిచ్చాడు.

లంకా దహనం

మండుచున్నలంకను చూచుచున్న హనుమంతుడు

రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతినీయ సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గి చేశాడు.

అప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు. తన తొందరపాటువలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయ్యిందేమో అన్న ఊహతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి, పనికి కీడు తెచ్చినందుకు రోదించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి, ఊరట చెందాడు. మరొక్కమారు సీతను దర్శించి, ఆమెకు సాంత్వన వచనాలు పలికి, రాముడు సకల వానరసేనతో త్వరలో రాగలడని అభయం పలికాడు. ఆమెకు ప్రణమిల్లి, తిరిగి ఉత్తరదిశకు బయలుదేరాడు.

ఇలా హనుమంతుడు రాముని దూతగా సాగరాన్ని లంఘించి, సీతను కనుగొని, రాక్షసులను సంహరించి, లంకను భయభ్రాంతమొనర్చి, రావణుని మదమణచి, సీతకు సాంత్వన కూర్చి, తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు.

తిరుగు లంఘనం

లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు

హనుమంతుడి పద ఘట్టనంతో అరిష్ట పర్వతం నేలలో క్రుంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి, ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్దయెత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయసూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు. మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. - "కనుగొంటిని సీతమ్మను. ఆమె రాక్షసుల బందీయై, రాముని కొరకు ఎదురు చూచుచు కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. "కనుగొంటిని" అన్న మాటలతో వానరు లందరూ పరమానందము పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శనా విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.

ఇంక అంతా కలసి వెళ్ళి లంకను నాశనం చేసి, రావణుని ఓడించి, సీతను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించుట సరైనపని అని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు.

మధువనం

మదువనములో గొదవ చేయుచున్న వానరులు

సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని పరివేష్టించి కిష్కింధకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకొన్నారు. అది సుగ్రీవునిది. దధిముఖుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకొని తింటూ, మధువులను గ్రోలుతూ, చిందులు వేస్తూ, మత్తెక్కి పిచ్చిగా ఆడుతూ వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దధిముఖుని తీవ్రంగా దండించారు. దిక్కు తోచని దధిముఖుడు తన తోటి వన రక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకొన్నాడు.

సీతాన్వేషణా కార్యం సఫలమయి ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దధిముఖుడు సీతాన్వేషణా సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దధిముఖుని అభినందించాడు. దధిముఖుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు. ఆంగదుడు, హనుమంతుడు, తక్కిన బృందం రివ్వున ఆకాశానికెగిరి ఝంఝూమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు.

రామునకు సీత జాడ తెలుపుట

అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. దృష్టా దేవీ (చూచాను సీతను) అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, మె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.

ఓ రామా! సీతామాత ఏకవేణియై, రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నిన్నే స్మరించుచున్నది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరింతువనే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక మాసము లోపల అట్లు కాకున్నచో తాను ప్రాణములతో ఉండజాలనన్నది. రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారమున చూడగలవని చెప్పి ఆమెను అనునయించితిని. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చితిని. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.


(యుద్ధకాండము - మొదటి సర్గము నుండి) - హనుమంతున మాటలు విని శ్రీరాముడు ప్రసన్నుడై ఇట్లు పలికెను. "హనుమంతుడొనర్చిన ఘన కార్యములు లోకములోనే అత్యద్భుతములైనవి. ఊహకు అందనివి. అనితర సాధ్యములు. హనుమంతునితో సమానుడైన తేజోబల సంపన్నుడు ఎవ్వడును లేడు. దుష్కరమైన ప్రభుకార్యములను సాదించుటయే గాక, దానికి భంగము కలుగకుండ, తదనురూపములైన ఇతర కార్యములను కూడ సాధించు సేవకుడు అత్యుత్తముడు. ఈ కార్య సాధన ద్వారా హనుమంతుడు మాయందరి ప్రాణములను కాపాడినాడు. నాకిట్టి మహోపకారమొనర్చిన హనుమంతునకు తగిన ప్రత్యుపకారము చేయలేని దీనుడనై యున్నాను. గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఈయగలను. ప్రస్తుతము నేనీయగలిగిన నా సర్వస్వమిదియే", అని శ్రీరాముడు పులకిత గాత్రుడై తాను అప్పగించిన కార్యమును సాఫల్యమొనర్చి, పవిత్రాత్ముడై వచ్చిన హనుమంతుని తన హృదయమునకు హత్తుకొనెను.

(ఆధ్యాత్మ రామాయణము: శ్రీరాముని పాదపద్మములను తులసీ దళాదులతో పూజించినవారు సాటిలేని పరమపదమును పొందెదరు. అట్టి శ్రీరామ చంద్రుడే పుణ్యముల రాశియైన హనుమంతుని అనుగ్రహించి, స్వయముగా ఆయనకు తన ఆలింగన సౌఖ్యమును ప్రసాదించెను. ఆ మారుతి భాగ్యమును ఎంతని కొనియాడగలము - గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ ప్రచురణలోని అనువాదము)

==సుందరకాండ ప్రాముఖ్యత==y రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది. సుందరకాండ పేరు గురించి పైన వ్రాసిన విషయాలలో ఆ కాండము మంత్రయుక్తమనీ, పారాయణా భాగమనీ తెలుపబడింది. సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు తీరుతాయనీ, తలపెట్టిన కార్యం విజయవంతమౌతుందనీ బహుధా విశ్వాసం ఉంది. బ్రహ్మాండపురాణం ఈ కాండమును "సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది. అనగా ఇది రామాయణమునకు బీజకాండము. అసమానమైన మంత్రము. దీని పారాయణమున లభించని సిద్ధి మరొక విధముగా లభించదని బ్రహ్మ శాసనము. అదే బ్రహ్మాండ పురాణము రామాయణములోని ఒక్కొక్క కాండము పారాయణమునకు ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండ గురించి "చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం, హనూమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండ ఉత్తమమ్" అని పేర్కొన్నది..[1]

సుందరకాండ పారాయణా విధానం, ఒక్కొక్క భాగానికి లభించే ఫలసిద్ధి గురించి పెక్కు విశ్వాసాలు, ఆధ్యాత్మ గ్రంథాలు ఉన్నాయి. గుంటూరు శేషేంద్ర శర్మ తన "షోడశి - రామాయణ రహస్యాలలో తెలిపిన కొన్ని విశేషాలు [1]

  • రామాయణానికి ఇది బీజకాండము. మంత్ర సంయుక్తము.
  • దీనిలో గుప్తముగా హనుమంతుని కుండలినీ యోగసాధన నిక్షిప్తమై ఉన్నది. మొదటి శ్లోకంలో "చారిణా చరిత పథే.." అన్న పదాలలోనే యోగ సాధన సూచితమైంది. మైనాక, సురస, సింహికా వృత్తాంతాలు గ్రంథి త్రయ భేదనాలకు నిదర్శనాలు. లంకయే మూలాధార చక్రము. సీతా వర్ణనలో వాడిన అనేక పదాలు పరాశక్తికి, కుండలినీ శక్తికి నిదర్శనాలు. సీత కృశించిన "పన్నగేంద్ర వధువు" వలె ముడుచుకొని యున్నది. ("బిస తంతు తనీయసీ" అని కుండలిని వర్ణిస్తారు). ప్రతిపత్ చంద్ర కళ, విద్య, శ్రద్ధ, బుద్ధి, ఆజ్ఞ, కీర్తి వంటి ఉపమానాలు అన్నీ దేవి నామాలుగా లలితా సహస్రనామ స్తోత్రముదేవీ భాగవతముదుర్గా సప్తశతి వంటి గ్రంథాలలో ఉన్నాయి. "సుందర" కాండ అనే పేరే సచ్చిదానంద సౌందర్యమూర్తిని సూచిస్తుంది.
  • త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్ర సంయుక్తము. రామాయణంలోని 24 వేల శ్లోకాలలో 12001వ శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది మణిపతకం వంటిది.
  • వ్యాధులు, కారాగృహ బంధనములు, గ్రహపీడలు, అనపత్యతలు, దారిద్ర్యములోనైన సంకటములన్నియను సుందరకాండ పారాయణము వలన తొలగుటయే గాక భక్తి ముక్తులును కలుగును. ఇది పారంపర్యముగ వచ్చిన మూఢ విశ్వాసము కాదు. పరీక్షితము, సిద్ధాంతితము, ప్రత్యక్షము, సహేతుకము.
  • తత్వ సంగ్రహ రామాయణములో ఏయే సర్గ పారాయణం వలన ఏయే ఫలితాలు కలుగుతాయో చెప్పబడింది.
  • అర్ధ పంచక జ్ఞానము ఆచార్యుల వలననే కలుగునని హనుమంతుని చర్య వలన బోధింపబడింది. అర్ధ పంచకమనగా (1) ప్రాప్యమగు బ్రహ్మ స్వరూపము (2) జీవాత్మ స్వరూపము (3) ఉపాయ స్వరూపము (4) ఫల స్వరూపము (5) విరోధి స్వరూపము
  • దశేంద్రియాధిష్ఠితమైన దేహమే లంక. అహంకార మమకారములు రావణ కుంభకర్ణులు. బంధింపబడిన చేతనుడే సీత. వివేకమే విభీషణుడు. భగవంతుడు తనను రక్షించునో రక్షింపడో అన్న సందేహముచే పరితపించుచున్న జీవునికి ఆచార్యుడు అర్ధ పంచక జ్ఞానము కలుగజేసి ఉజ్జీవింపజేయును.
  • ద్వయ మంత్రములోని శరణ శబ్దార్ధ రహస్యములు ఇందులో వివరింపబడినవి. గాయత్రీ మంత్రములోని "దేవ" శబ్దార్ధము ఇందు శ్రీరామ దివ్య మంగళ విగ్రహ వర్ణనచే వర్ణింపబడింది.
  • సంసార సాగర తరణము కోరు యోగులకు తగిన అభ్యాస విధి ఇందలి హనుమంతుని చర్యల వలన తెలియుచున్నవి.
  • సుందర కాండములోని మొదటి అక్షరము "త" (తతో రావణీతాయాః సీతాయాశ్శత్రుకర్శనః). చివరి అక్షరము "త" (తథాభిపీడితా). ఇది గాక సుందరకాండ ప్రతి సర్గమున మొదటి అక్షరములో సకారముగాని, తకారము గాని, లేదా శ్లోకములో "సీత"యను పదముగాని, తత్పర్యాయపదము గాని ఉండును. అలా కాని చోట్ల సర్గ రెండవ శ్లోకము మొదటి అక్షరము సకారము గాని తకారము గాని కలిగియుండును. "సీత"యే సుందరకాండమునకు అధిష్ఠాన దేవత. "ఓం తత్ సత్" ఈ కాండములో నిక్షిప్తమై ఉంది

ఆపదల నివారణ కోసం, అభీష్ట సిద్ధి, సంకల్ప జయం కోసం సాంప్రదాయికంగా సుందరకాండను పారాయణం చేసే ఆచారం ఉంది. భక్తులు తమ ఇష్టానుసారం, వీలునుబట్టి పారాయణ చేస్తారు. అంతే కాకుండా "ఉమా సంహిత", "తత్వ సంగ్రహం", "బ్రహ్మాండ పురాణం", "పారాశర్య ఉపపురాణం" వంటి గ్రంథాలలో పారాయణకు కొన్ని ప్రత్యేక విధానాలు చెప్పబడ్డాయి. ఏయే తిథి, వార, నక్షత్రాలలో ఏయే శ్లోకాలు, సర్గలు పారాయణం చేయాలో కూడా వివరింపబడింది. ఈ పారాయణంలో "సామాన్య పద్ధతి", "సంపుటీకరణ పద్ధతి" అనే రెండు విధానాలున్నాయి. చైత్ర, వైశాఖ, జ్యేష్ట, శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక, మార్గశీర్ష, మాఘ ఫల్గుణ మాసములలోను; విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులయందును; ఆది, బుధ, గురు, శుక్ర వారములలోను ఈ పారాయణ ప్రాంభించుట మంచిదని - నదీ సాగర తీరములందును, పవిత్ర తీర్ధ క్షేత్రములందును, దేవాలయములలోను, భక్తుల సన్నిధియందును, స్వగృహ దైవ ప్రారంధనా మందిరాలలోను, తులసి కోట చెంతను ఈ పారాయణము ఆచరించుట శుభ ప్రథమని సంప్రదాయ విశ్వాసము. మొత్తం కాండం పారాయణం మాత్రమే కాకుండా ఒక్కొక్క దుఃఖ నివారణకు లేదా ఫల సిద్ధికి కొన్ని కొన్ని శ్లోకములు కూడా పారాయణకు ఉత్తమములని చెబుతారు. "సప్తసర్గ పారాయణ" అనే క్రమం కూడా ఆచరణలో ఉంది.

సాధారణంగా పారాయణానికి ముందు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం అంగన్యాస కరన్యాసాదులు నిర్వహిస్తారు. ఒక విధానం ప్రకారం పారాయణం ఈ క్రమంలో ఉంటుంది.

కష్టభంజనుడు హనుమంతుడు - సారంగపూర్ స్వామి నారాయణ మందిరంలోని విగ్రహం

మొదటి శ్లోకము

తతో రావణీతాయా స్సీతాయా శ్శత్రుకర్షనః
ఇయేష పదమన్వేష్టుం చారణా చరిత పథే

తరువాత రావణాసుర
వరనీతధరాత్మజాత పదమున్వెదకన్
గురుచారణ మార్గంబున
నరుగఁగ నృపదూత గర్శితారి తలంచెన్


చంద్రోదయ వర్ణన

హంసో యథా రాజత పంజరస్థః
సింహోయథా మందర కందరస్థః
వీరో యథా గర్విత కుంజరస్థః
చంద్రోపి బభ్రాజ తథాంబరస్థః

రాజత పంజరస్థమగు రాజ మరాళము భంగి, మందర
భ్రాజిత కందరస్థ మృగరాజము వైఖరి, భూరి దుర్మదో
ద్వేజక కుంజరస్థుడగు వీరవిధంబునఁ, జంద్రుడయ్యెడన్
రాజిలె నంబరస్థుడయి రాజముఖీ వదనాభిరాముడై
 

ప్రార్ధనా శ్లోకము

నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః

మ్రొక్కెద రామచంద్రునకు మోడ్చెదఁ గేలు సుమిత్ర పట్టికిన్
మ్రొక్కెదఁ దద్విహేహప తనూజకు శ్రీరఘురాము దేవికిన్
మ్రొక్కెద ధర్మ వాసవ మరుద్గణ మారుత రుద్రపాళికిన్
మ్రొక్కెద సూర్య చంద్రులకు మ్రొక్కెదఁ దామరసాప్త సూతికిన్
 

సీత వర్ణన

తదున్నసమ్ పాండురదంత మవ్రణమ్
శుచిస్మితమ్ పద్మ పలాశ లోచనమ్
ద్రక్ష్యే తదార్యా వదనమ్ కదాన్వహమ్
ప్రసన్న తారాధిపతుల్య దర్శనమ్

యెప్పుడు చూతునో యేనున్నసంబు, బాండురదంత మవ్రణమునగుచు
మందహాసాంకూర సుందరంబయి పద్మ దళలోచనంబులఁ జెలువుగాంచి
నిర్మ తారేశ నిభదర్శనంబగుచు, నమ్మహాదేవి యాస్యము నేను
ఏగతిఁ గందునో హీనుండు క్షుద్రుండుఁ బరమపాపియుఁ గ్రౌర్యపరుంఢు దులువ
దారుణండయ్యను సువేషధారియయిన
యసుర భూపతిచే బలాత్కృతినపహరింపఁ
బడిన సాధ్విఁ దపస్విని బుడఁము కూతు
రామదేవుని దేవి సతీమతల్లి

నత్వేవ సీతాం పరమాభిజాతామ్
పథి స్థితే రాజకులే ప్రజాతామ్
లతాం ప్రపూల్లామివ సాధుజాతాం
దదర్శ తన్వీం మనసాభిజాతామ్
తాం స్మృతీమివ సందిగ్దామ్ బుద్ధిం నిపతితామివ
విహతామివ చ శ్రద్ధామ్ ఆశాం ప్రతిహతామివ
సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ
అభూతేవాపవాదేన కీర్తిం నిపతితామివ

కుదుటఁబడని శ్రద్ధ, మదికి సందిగ్ధమౌ
స్మృతియు, క్షీణమౌ సిరియుఁ గలుష
యుక్తమైన బుద్ధి, యుపహతిఁ గూడిన
కార్యసిద్ధి నాఁగ గ్రాలుదాని


ఇయం కనక వర్ణాంగీ రామస్య మహిషీ ప్రియా
ప్రణష్టాపి సతీ యాస్య మనసో న ప్రణస్యతి
అస్యా దేవ్యా యథా రూపమ్ అంగప్రత్యంగ సౌష్టవమ్ 
రామస్య చ యథా రూపం తస్యేయమసితేక్షణా

ఈ కనకాంగి రాము హృదయేశ్వరి దేవెరి దూరవిప్రవా
సాకుల యయ్యు రాముహృదయంబుననెప్పుడుఁ బాయదున్న, ద
స్తోకము రామచంద్రునెఁడ దోఁచు సురూపము నంగసౌష్ఠవం
బీ కువలాక్షి యందుఁ బరిదృశ్యము లయ్యెను యుక్తమే కదా?

త్రిజటా స్వప్నము

ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంశ్రితమ్
గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగామ్
యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః
శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః
స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృతా
సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థితా
రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభా యథా
రాఘవశ్చ మయా దృష్టః చతుర్దంతం మహాగజమ్
ఆరూఢః శైల సంకాశం చచార సహ లక్ష్మణః
తతస్తౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజసా
శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ
తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్థస్య దంతినః

ఆకాశ గమనంబు హంస సహస్రంబు, గజదంత మయమైన కలికి పల్ల
కీలోనఁ దెల్లని మాలికల్ చేలముల్, దాల్చి సుమిత్రాగ్ర తనయుతోడ
రామచంద్రుఁడు వచ్చె రమణీయ శుక్లాంబ, రావృత యగుచు నీ దేవి పాల
వెల్లి లోపల నున్న వెల్లని గట్టుపై, భానునితోఁ బ్రభ పరఁగునట్లు
రామచంద్రుతోడ రంజిల్లఁ గంటిని
ధరముఁబోలి నాల్గు దంతములను
మీఱుచున్న గజము మీద సలక్ష్మణుఁ
గౌసలేయు నరుఁ గంటిఁ గలను
 

శ్రీరామ లక్ష్మణ వర్ణన

రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే
తేజసా ఆదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః
బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః
రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా
రక్షితాస్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః
రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా
మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సః

రాముండు కమలపత్ర విశాలలోచనుం, డఖి సత్వసుమనోహర గుణుండు
రూపదాక్షిణ్య నిరూఢుఁడై జనియించెఁ దేజంబునందు నాదిత్యుఁబోలు
నోరుపు గుణమున నుర్వికిఁ దుల్యుండు, బుద్ధి బృహస్పతి పురుడు చూపు
సద్యశంబున హరి సకల జీవావళీ, రక్షకుఁడాత్మీయ రక్షకుండు
స్వకుల వృత్తి ధర్మ సంరక్షకుఁడు నాల్గు
జాతుల నరయుచుండు రీతి చెడక
మనుజ హితములైన మర్యాదలందుండి
పరుల నట్ల చేయఁ బనుచుచుండు

భ్రాతా చ తస్య ద్వైమాత్ర స్సౌమిత్రి రపరాజితః
అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథవిధః

రాముని ద్వైమాతురుఁడగు సౌమిత్రి యజయ్యుఁ డాజి సద్గుణ రూప
ప్రేమములనట్టివాఁ డుర్వీ మండలి దేవి! నిన్ను వెదకుచు వారల్


అంగుళీ ప్రదానము

వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః
రామనామాంకితం చేదం ప్రశ్య దేవ్యంగుళీయయకమ్

ఇంకను నమ్మవేని జనకేశ్వర నందిని చూడు రామ నా
మాంకితమైన యుంగరము నాదఁటబంచె నతండు దీని నీ
కింకరు చేత నీదు మదికిన్ ఘటియింపఁగ నమ్మంబు నీ
యంకిలి దీఱు నంచొసఁగ నా యమ గైకొని దానిఁ బ్రీతితోడన్

హనుమంతుని జయ ఘోష

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

జయము జయంబు రామునకు సార పరాక్రమ ధన్యమూర్తికిన్
జయము జయంబు విద్విషద సహ్య తరస్వి సుమిత్ర పట్టికిన్
జయము జయంబు దాశరథి సంపరిపాలితుఁడౌ వలీముఖో
చ్చయ పతి సూర్య పుత్రునకు సాహస విక్రమ కీర్తి శాలికిన్

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః

దాసుఁడ సర్వ సద్గుణ వితాన మనోహర రామమూర్తికిన్
గోసల దేశ వల్లభుకున్ హత శత్రుఁడ వాయుపుత్రుఁడన్
నా సరిగారు సంగరమునన్ దశకంఠులు వేవురేనియున్
వాసి యడంతు ఱాల ద్రుమపాళుల నే హనుమత్సమాఖ్యుఁడన్

అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్

ధ్వంసంబుఁ జేసి లంకను
హింసించి సమస్త రాక్షసేంద్రుల సీతా
హంసీయానకు మ్రొక్కి ప్ర
శంసిత గతిం జనెద మిడుక సకల సురారుల్.

మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడు, కిష్కింధకు ప్రభువు అయిన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసల దేశపు ప్రభువు అయిన శ్రీరామునకు నేను దాసుడను. వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయి మంది రావణులైనా గాని యుద్ధ రంగమున నన్నెదిరించి నిలువలేరు. వేలకొలది శిలలతోడను, వృక్షములతోడను సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. రాక్షసులందరూ ఏమీ చేయలేక చూస్తూ ఉండెదరు గాక. నేను వచ్చిన పనిని ముగించుకొని, సీతాదేవికి నమస్కరించి వెళతాను.

అంబరీషుడు

అంబరీషుడు 

              @@@

ఇది భాగవతంలోని ఒక చిన్న ఉపకథ.  

నాభాగుడు అనే మునిపుంగవుని కుమారుడు అంబరీషుడు.  సత్యనిష్టాగరిష్టుడు.  మహా పండితుడు.  ధర్మాధర్మ విచక్షణ తెలిసినవాడు.  అతిధి అభ్యాగతులను ఆదరించేవాడు.  ఎవరో ఒక అతిధిని ఆహ్వానించి భోజనం పెట్టకుండా తాను భోజనం చేసేవాడు కాదు.  ఇతని సత్యసంధతకు, ధర్మగుణానికి మెచ్చి త్రిమూర్తులు సైతం ప్రసన్నంగా ఉండేవారు.  

ఒకరోజు అంబరీషుడు ద్వాదశీవ్రతాన్ని ఆచరించి కొందరు బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించి వారి ఆశీర్వాదాలు పొందిన తరువాత భోజనస్వీకరణకు సంసిద్ధులు అయ్యాడు.  ఆ సమయంలో దుర్వాస మునీంద్రుడు అరుదెంచాడు.  అంబరీషుడు ఆయనకు వినయంగా నమస్కరించి, పాదపూజ చేసి, సమీపంలోని నదికి వెళ్లి స్నానం చేసి వచ్చి తమతో కలిసి భోజనం చెయ్యమని కోరాడు.  సరే అని నదీస్నానానికి వెళ్ళాడు దుర్వాసుడు.  

అయితే ఆయన ఎంతసేపటికీ తిరిగిరాలేదు.  ద్వాదశీవ్రత ఫలితాన్ని ప్రసాదించే పుణ్యఘడియలు దాటిపోతున్నాయి.  దుర్వాసుడు రాకుండా భోజనం చేస్తే మహాపాపమే కాక, ఆయన ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.   దాంతో ఆందోళన చెందిన అంబరీషుడు బ్రాహ్మణులను సలహా కోరుతాడు.  ఉదకపానం గావిస్తే వ్రతఫలితం దక్కుతుందని, భోజనం చెయ్యలేదు కాబట్టి ఆయన కోపాన్ని తప్పించుకోవచ్చని సలహా ఇస్తారు బ్రాహ్మణులు.  ఆ సలహా ప్రకారం మంచినీటిని సేవిస్తాడు అంబరీషుడు.  

అప్పుడు దుర్వాసుడు వచ్చి తాను లేకుండా అంబరీషుడు ఉదకపానం గావించిన విషయం తెలుసుకుని ఆగ్రహించి తన తప్పశ్శక్తితో ఒక రాక్షసిని సృష్టించి అంబరీషుడిని మింగివేయాల్సిందిగా ఆదేశిస్తాడు.  రాక్షసి అంబరీషుడిని సమీపించేంతలో విష్ణుమూర్తి ప్రయోగించిన సుదర్శన చక్రం అడ్డువచ్చి రాక్షసిని సంహరించి దుర్వాసుని వెంటపడుతుంది.  దుర్వాసుడు ప్రాణభయంతో పారిపోయి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల లోకాలకు వెళ్లి ప్రాణాన్ని రక్షించమని కోరుతాడు.  అయితే వారు అందుకు నిరాకరించి నువ్వే వెళ్లి అంబరీషుని పాదాలమీద పడి శరణుకోరి ప్రాణాలు కాపాడుకోమని సలహా ఇస్తారు.  దుర్వాసుడు భూలోకం వెళ్లి అంబరీషుని కాళ్ళమీద పడి శరణు వేడగా అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడు.  చక్రం వెనక్కు వెళ్ళిపోతుంది.  

***

పై కథ మనకు అనేక నీతులు బోధిస్తుంది.  

మనకు ఎన్ని సిరులు, సంపదలు ఉన్నప్పటికీ, గర్వించకుండా పేదలపట్ల కరుణాభావంతో వర్తించాలి.  అతిధులను సమాదరించాలి.  

మన భక్తిలో చిత్తశుద్ధి ఉంటే, మనను భగవంతుడు రక్షిస్తాడు.  మనలో మంచితనం ఉంటే, స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగులు కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ముందుకొస్తారు.  మన ప్రవర్తన సరిగ్గా లేకపోతె మనం ఇతరుల కోపాలకు బలిఅవుతాము.  

మనలను ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు భోజన సమయానికి అరగంట ముందే హాజరవ్వాలి.  వారు మనకోసం ఎదురు చూస్తారా చూడరా అని పరీక్షించరాదు.  కొంతమంది కావాలనే పిలిచిన టైముకు వెళ్లకుండా పదిసార్లు ఫోన్ చేయించుకుంటారు.  అవతలి వ్యక్తులను టెన్షన్లకు గురి చేస్తారు.  ఒకవేళ మనం వెళ్ళడానికి ఆలస్యం అయ్యే పక్షంలో హోస్టులకు ఫోన్ చేసి చెప్పి వారిని భోజనం కానివ్వమని చెప్పాలి.  ఎందుకంటే బీపీ, సుగర్ల కాలం ఇది.  సమయానికి ఆహారం తీసుకోకపోతే కోమాలోకి వెళ్లాల్సి వస్తుంది.  మనం ఆలస్యంగా వెళ్లి వాళ్ళ మీద పోట్లాడితే అది మన విలువను తగ్గిస్తుందని గ్రహించాలి.

ఆంజనేయ శ్లోకాలు

1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
 
2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
 
3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!
 
4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
 
5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
 
6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
 
7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!
 
8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

14, మే 2020, గురువారం

పలితుడు

పలితుడు 

@@@

రాజు దుర్బలుడు అయినపుడు బలవంతుడైన శత్రువును ఎలా ఎదుర్కోవాలి? అని  ధర్మరాజు ఒకసారి భీష్మణాచార్యుడిని ప్రశ్నించినపుడు ఆ కురువృద్ధుడు ఈ గాధను చెప్పాడట.  ఇది ఒకరకమైన యుద్ధ వ్యూహం.  

పలితుడు అనే ఎలుక ఒక చెట్టు కింద బొరియను నిర్మించుకుని నివసిస్తున్నది.  ఆ చెట్టు పైన రోమశుడు అనే మార్జాలం నివసిస్తున్నది.  ఒకరోజు ఒక వేటగాడు ఆ చెట్టుకింద పిట్టల కోసం వలను పన్ని వెళ్ళిపోయాడు.  ఆ రాత్రి చీకట్లో మార్జాలం చెట్టుపైకి వెళ్ళబోతూ ఆ వలలో చిక్కుకున్నది.  రాత్రివేళ ఎలుక ఆహారం కోసం బయటకు వచ్చింది.  అప్పుడే ఆ చెట్టు కొమ్మ మీద ఒక గుడ్లగూబ, ఒక ముంగిస దాన్ని చూశాయి.  ఆ రెండు జంతువులనుంచి ప్రాణాలతో తప్పించుకుని వెళ్లడం అసంభవం అని గ్రహించిన ఎలుక...   వలదగ్గరకి వెళ్లి పిల్లితో నేను ఈ వల తాళ్లను కొరికి నిన్ను రక్షిస్తాను.  కానీ పైన కొమ్మ మీద గుడ్లగూబ, ముంగిస నన్ను చూశాయి.  బయటకు వేస్తె నన్ను తినేస్తాయి"  అన్నది.  అపుడు పిల్లి పెద్దగా అరిచింది.  పిల్లి అక్కడ ఉన్న సంగతి గ్రహించిన గుడ్లగూబ, ముంగిస పిల్లిని చూసి భయపడి పారిపోయాయి.  ఎందుకంటే పిల్లికి ఆ రెండు జంతువులూ ఆహారమే.  

  "హమ్మయ్య... అనుకుని ఎలుక ఈల వేసుకుంటూ  ఆహారం తిని మళ్ళీ బొరియ దగ్గరకు వచ్చింది.  పిల్లి కోపంగా "నీ ప్రాణాలను రక్షించాను.  కానీ నువ్వు మాత్రం కృతఘ్నత తో నన్ను రక్షించకుండా వెళ్ళిపోయావు.  తొందరగా ఈ తాళ్లను తెంచు"  అన్నది.  

  ఎలుక నవ్వి "ఈ తాళ్లను ఇప్పుడే కొరికితే ఆకలితో నకనకలాడుతున్న   నువ్వు  ముందు నన్ను తినేస్తావు.  కొంచెం సేపు ఆగు.  బోయవాడు వస్తుండగా వలను కొరుకుతాను.  అప్పుడు నువ్వు ప్రాణభయం తో పారిపోతావు కాబట్టి నాకు ప్రమాదం ఉండదు." అని బొరియ లోపలి వెళ్ళింది.  

  తెల్లవారిన తరువాత బోయవాడు వస్తుండగా ఎలుక వల దగ్గరకు వచ్చినది.   పిల్లి ప్రాణభయంతో వణికి పోతున్నది.   అప్పుడు మూషికం గబగబా  తాళ్లను కొరికింది.  పిల్లి ప్రాణభయం తో పారిపోయింది.  ఎలుక మళ్ళీ కలుగు లోకి వెళ్ళిపోయింది.  వేటగాడు వలను తీసుకుని వెళ్ళాక మెల్లగా పిల్లి ఎలుక బొరియ దగ్గరకి వచ్చి "మిత్రుడా...నా ప్రాణాలను రక్షించావు.  నిన్ను సన్మానిస్తాను.  బయటకి రా"  అన్నది.  

 అప్పుడు ఎలుక కలుగు లోనించి రాకుండా "నిన్ను నమ్మడమా?  అసంభవం.  రాత్రంతా ఆకలితో మాడిపోయి ఉన్నావు.  నేను బయటకి వస్తే ముందు నువ్వు నన్ను తిని ఆకలి తీర్చుకుంటావు.  వెళ్ళు వెళ్ళు "  అన్నది హేళనగా.

  తన పధకం పారకపోవడం తో పిల్లి నిరాశగా వెళ్ళిపోయింది.  

                   @@@  

 పై కథనుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

నేటి పచ్చి అవకాశవాద రాజకీయాలకు ప్రతీక ఈ పలితుడు-రోమశుడి గాథ.   

  2004  లో బీజేపీ తో కలిసి తెలుగుదేశం పోటీ చేసింది.  ఎన్నికలలో ఓడిపోగానే పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నారు.  ఒకరిముఖం మరొకరు చూడబోమని శపధాలు చేసుకున్నారు.  2014  లో మళ్ళీ ఇద్దరు దగ్గరయ్యారు.  ఇక కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం తో ఎన్ని సార్లు పొత్తు పెట్టుకున్నారో, ఎన్నిసార్లు విడిపోయారో ఆ దేవుడికే తెలియాలి.  

  మనదగ్గరే కాదు. దేశమంతా ఇలాగే ఉన్నది.  నితీష్ కుమార్, మాయావతి, ములాయం, కరుణానిధి, జయలలిత, వైగో, ఎన్నెన్ని పార్టీలతో కలిసారో, ఎన్నెన్ని పార్టీలతో విడిపోయారో లెక్కే లేదు.  అక్కడ ఉన్నది ఒకటే లెక్క.  శత్రువు శత్రువు మిత్రుడు అనే లెక్క మాత్రమే.  సిద్ధాంతాలు లేవు, సిగ్గెగ్గులు లేవు.  మానాభిమానాలు లేవు. ఒకరిమీద మరొకరికి విశ్వాసం లేదు.   అంతా పచ్చి అవకాశవాదం. ఇలాంటి నాయకులు అందరూ కలియుగ పలితులు, రోమశులు అన్నమాట...అవసరార్ధం కలుస్తారు.  అవసరాలు తీరాక పొట్లాడుకుని కత్తులు దూసుకుంటారు.

ఇది భారతం లోని కథ.  భారతం లో లేనివి ప్రపంచం లో లేవు.  ప్రపంచంలో ఉన్నవి అన్నీ భారతం లో ఉన్నాయి అంటే ఇదే మరి.

11, మే 2020, సోమవారం

పరీక్షిత్తు

పరీక్షిత్తు 

@@@

  అభిమన్యుడు ఉత్తర లకు జన్మించిన వాడు.  యితడు గర్భం లో ఉండగా అశ్వద్ధామ బ్రహ్మ శిరోనామకాస్త్రము అనే ఆయుధం తో కొట్టాడు. ఆ బాధను ఓర్చుకోలేక ఉత్తర శ్రీకృష్ణుడిని ప్రార్ధించింది.  శ్రీకృష్ణుడు వచ్చి ఆమె బాధను నివారణ చేసాడు.  యితడు గర్భం లో ఉన్నపుడే లోకాన్ని పాలించే పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడా అని పరీక్షించాడట... ఆ కారణంగా ఇతను పరీక్షిత్తు నామధేయుడు అయ్యాడు. 

  పరీక్షిత్తు అరవై సంవత్సరాలు పరిపాలించాడు.  ఒకనాడు వేటకై అడవికి వెళ్లి ఒక జింక ను చూసి తరుముతూ వెళ్తుండగా ఆ జింక శమీకుడు అనే ముని ఆశ్రమం లో దూరింది.  తపస్సు లో ఉన్న శమీకుని చూసి "ఇటు వచ్చిన జింక ఏమైంది?" అని అడిగాడు పరీక్షిత్తు. శమీకుడు బదులు ఇవ్వలేదు.  పరీక్షిత్తు కు కోపం వచ్చి అక్కడ చచ్చిన పాము ఒకటి కనిపిస్తే దాన్ని తీసి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు.   కొంచెం సేపు తరువాత శమీకుని కుమారుడు శృంగి అనేవాడు ఆశ్రమానికి వచ్చి తండ్రి మెడలోని సర్పాన్ని చూసి ఆగ్రహావేశుడై "నా తండ్రి మెడలో సర్పాన్ని వేసిన వాడు ఏడు రోజుల్లోగా  సర్పం కాటుకు బలి అవుతాడు"  అని శపించాడు.  

  ఆ తరువాత శమీకుడు మేలుకొని జరిగిన విషయం గ్రహించి "రాజును శపించడం తప్పు.  బ్రాహ్మణ శాపం తప్పించడం తరం కాదు.. కనుక ప్రాయశ్చిత్తం చేసుకోమని పరీక్షిత్తు కు చెప్పు"  అని తన శిష్యుడిని పరీక్షిత్తు దగ్గరకి పంపించాడు.  ఆ శాపం వివరాలు తెలియగానే పరీక్షిత్తు భయకంపితుడై ఏ రకమైన పురుగు పుట్రా చొరబడటానికి వీలులేని విధంగా ఒక కోటను నిర్మించుకుని భయంభయంగా కాలం గడుపుతున్నాడు.  

  ఒకరోజు కొందరు బ్రాహ్మణులు పరీక్షిత్తును ఆశీర్వదించడానికి కోటకు మంత్రించిన నిమ్మకాయలు ఇచ్చారు.  పరీక్షిత్తు ఆ నిమ్మకాయను తీసుకుని వాసన చూసాడు.  ఆ నిమ్మకాయలో సూక్ష్మ రూపం లో దాక్కున్న సర్పం ఒకటి బయటకి వచ్చి పరీక్షిత్తును కాటువేసింది.  పరీక్షిత్తు తక్షణమే మరణించాడు.  

భారతం, భాగవతమ్ కావ్యాలలో చెప్పబడిన కథ ఇది. 

                 @@@  

నిజానికి ఈ కథలో నీతుల కంటే దిగ్భ్రమగొలిపే వింతలు ఎక్కువ.  

గర్భస్థ శిశువుకు కూడా గుండె, కిడ్నీ ఆపరేషన్స్ జరుగుతున్న వార్తలను ఈరోజుల్లో వింటున్నాము.  మన పురాణకాలం లో కూడా గర్భస్థ శిశువులకు అనారోగ్యాలు సంభవించినపుడు శ్రీకృష్ణుడు లాంటి వైద్యులు సర్జరీలు చేసి కాపాడేవారు అని అర్ధం చేసుకోవాలి.  

 ఇక తనకోపమే తనశత్రువు అని శతకకారుడు చెప్పినట్లు అకారణ  కోపం, అహంకార పూరిత ఆగ్రహం  అనేది మనిషి పతనానికి దారితీస్తుంది.  పెద్దలు అనే గౌరవం లేకుండా పరీక్షిత్తు ముందూ వెనకా చూడకుండా శమీకుని దేహంపై చచ్చిన పామును విసిరాడు.  పెద్దలను గౌరవించాలి, ఒకపని చేసేముందు దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోవాలి.  చేతిలో అధికారం ఉన్నది కదా అని అహంకరిస్తే అది అతని పతనానికి బాటలు వేస్తుంది.  

  పాములు పగబడతాయా లేదా అనేది ఎప్పటినుంచో చర్చనీయాంశం గా ఉన్నది.  పామరులు నమ్ముతారు.  శాస్త్రం అంగీకరించదు.  ఏ పాములను చంపినా, తాచు, నాగు పాములను చంపటానికి సాహసించరు.  అవి పగబట్టి ఎప్పటికైనా చంపుతాయి అని నమ్మకం మనలో ఉన్నది.  అలాగే పిల్లలు పుట్టగానే సర్పదోషాలు ఏమైనా ఉన్నాయో అని ముందుగా సిద్ధాంతులను ప్రతిఒక్కరూ సంప్రదిస్తారు.  సర్పదోషాలు ఉన్నాయి అంటే వాటికి శాంతులను చేయిస్తారు.  సుబ్రహ్మణ్య స్వామీ దేవాలయాలకు వెళ్లి పూజలు చేయిస్తారు.  ఎవరి అనుభవం ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప నేను చెప్పేదే నిజం అని వక్కాణించలేము.  

  చివరిగా చెప్పే మాట ఏమిటంటే... నా అనుభవంలో మాత్రం....సర్పదోషాలు ఉండటం...నూటికి లక్ష పాళ్ళు నిజం, నిజం, నిజం....

10, మే 2020, ఆదివారం

అజామిళుడు

అజామిళుడు

         @@@  

  ఇది భాగవతం లో ఒక పాత్ర.  పేరు అజామిళుడు.  ఇతను సద్బ్రాహ్మణ కుటుంబం లో జన్మించి వేదవేదాంగాలను క్షుణ్ణంగా అభ్యసించాడు.  ఒకరోజు తండ్రి ఆనతి మేరకు పూజకు కావలసిన పూలు కోయడానికి తోటకు వెళ్ళాడు.  పూవులు కొస్తుండగా ఇద్దరు యువతీయువకులు కౌగలించుకుని ముద్దులాడుకోవడం చూసాడు.  ఇతని మనసు గతి తప్పింది.  విరహం తో వేగిపోయాడు.  వచ్చినపని మరచిపోయి ఒక వేశ్యాగృహానికి వెళ్ళాడు.  ఒక వేశ్యా సంపర్కంతో పూర్తిగా కామాంధుడై ఇల్లూవాకిలి విస్మరించి ఆమె పొందు లోనే ఇరవైనాలుగు గంటలు గడపసాగారు.  

  వారికి కొందరు పిల్లలు పుట్టారు.  వార్ధక్య ప్రభావంతో అనేక వ్యాధుల బారిన పడి మృత్యువు కు చేరువ అయ్యాడు.  అతనిని తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. అదే సమయం లో అజామిళుడు తన పెద్ద కొడుకు నారాయణుని "నారాయణా.. నారాయణా.." అని పిలిచాడు.  వెంటనే అక్కడికి విష్ణుదూతలు వచ్చారు.  

  అతను ధర్మం వీడి వేశ్యాలోలుడై మహా పాపాలు చేసాడు కాబట్టి అతడిని నరకానికి తీసుకెళ్తాం అని యమదూతలు --- ఎన్ని పాపాలు చేసినా నారాయణ నామం జపించాడు కాబట్టి స్వర్గానికి తీసుకెళ్లాల్సిందే అని విష్ణుదూతలు వాదులాడుకున్నారు. అజామిళుడు వేదరహస్యాలు ఎరిగిన వాడు కాబట్టి అతడికళ్ళకు వీరి వాగ్వాదం కనిపించింది.   భయం తో మరింతగా నారాయణ నామం జపించాడు.  

  ఎంతసేపటికీ మరణం రాకపోవడం తో విష్ణు దూతలు, యమదూతలు వెళ్లిపోయారు.  అప్పటినుంచి అతడు పాపకార్యాలు వదిలేసి నారాయణ మంత్రం జపిస్తూ మరికొంతకాలం జీవించి నేరుగా స్వర్గలోకం వెళ్ళిపోయాడు. 

    ***  

నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

 మొదటిది -  యుక్తవయసు వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలను తల్లితండ్రులు జాగ్రత్తగా గమనిస్తుండాలి.  వారు కాలేజీలకు వెళ్తున్నారా లేక తమ ఆడ/మగ స్నేహితులతో సినిమాలకు, షికార్లకు వెళ్తున్నారా?  స్మార్ట్ ఫోన్స్ లో పెద్దలు లేనపుడు వారు ఏమి చూస్తున్నారు?  ఇలాంటి విషయాలను పెద్దలు చూస్తుండాలి.  పిల్లలమీద గుడ్డినమ్మకాలు పెట్టుకోకూడదు.  

 రెండోది -  ఒక మనిషి ఎన్ని తప్పులు అయినా చెయ్యవచ్చు... కానీ పశ్చాత్త్తాపం చెందటం,  చేసిన తప్పులు గ్రహించడం, మరోసారి అలాంటి తప్పులు చెయ్యకుండా ఉండటం  మనిషి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని పెంచుతుంది.

  అజామిళుడి కథ మనకు చెప్పేది అదే.

మయూరధ్వజుడు

మయూరధ్వజుడు 

@@@

                   ***  

 ప్రతిరోజూ మనం మయూరధ్వజుడ్ని చూస్తుంటాము.  కానీ అతను ఎవరో చాలామందికి తెలియదు.  అతడి ప్రాశస్త్యం తెలియదు.  అలాంటి వారికోసం ఈ కథ.

కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు సింహాసనం అధిష్టిస్తాడు.  ఆ ఆనందం లో గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని తలచి విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు.  శ్రీకృష్ణుడు ధర్మజునికి దాతృత్వం అంటే ఎలా ఉంటుందో పాఠం చెప్పాలని భావించి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను ఓడించి సామ్రాజ్య విస్తరణ చెయ్యమని సలహా ఇస్తాడు.  ధర్మరాజు అంగీకరించి అశ్వమేధయాగం చేసి యాగాశ్వాన్ని దేశం మీదకి పంపిస్తాడు.  దాని వెంట నకుల సహదేవులను సేనలతో సహా పంపిస్తాడు.  ఏ రాజు అయితే అశ్వాన్ని బంధిస్తాడో ఆ రాజును ఓడించి రాజ్యం వశపరుచుకోవడం ఈ యాగం యొక్క లక్ష్యం.  అలాకాకుండా అశ్వం ఒక రాజ్యం లోకి ప్రవేశించగానే ఆ రాజు లొంగి పోయి సామంతానికి  ఒప్పుకుంటే పేచీయే లేదు.  

 ఆ విధంగా ఆ అశ్వం మణిపుర రాజ్యం చేరుతుంది.  ఆ రాజ్య అధినేత మయూరధ్వజుడు.  గొప్ప బలశాలి.  అతని కుమారుడు తామ్రధ్వజుడు మరింత గొప్ప పరాక్రమవంతుడు.  తామ్రధ్వజుడు యాగాశ్వాన్ని బంధిస్తాడు.అతనితో యుద్ధం చేసిన నకుల సహదేవులు ఓడిపోయారు.  వెంటనే భీమార్జునులు కూడా వచ్చి యుద్ధం చేస్తారు.  వారిని కూడా ఓడించి బంధిస్తాడు తామ్రధ్వజుడు. 

  దాంతో మయూరధ్వజుడు ని యుద్ధం లో ఓడించడం కష్టమని గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మరాజు తో కలిసి మాయోపాయంతో మయూరధ్వజుని ఓడించాలని వృద్ధ బ్రాహ్మణుల వేషాల్లో మణిపురం వెళ్తారు.  "దానం కావాలి"  అని అడుగుతాడు శ్రీకృష్ణుడు.  "ఏమి కావాలో కోరుకోండి విప్రోత్తములారా"  అడుగుతాడు మయూరధ్వజుడు. 

  "మహారాజా... మేము నీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఈ బ్రాహ్మణుని సుతుడిని పట్టుకుని చంపపోయింది. బాలుడిని వదలమని మేము ప్రార్ధించగా మయూరధ్వజుని శరీరం లో సగభాగం కోసి తెచ్చినట్లయితే ఈ బాలుడిని విడిచిపెడతాను అన్నది.  కనుక మీ శరీరం లో సగభాగం కావాలి.  అది కూడా నీ భార్యా పిల్లలే నీ శరీరాన్ని కోసి ఇవ్వాలి"  అన్నాడు శ్రీకృష్ణుడు.  

  మయూరధ్వజుడు చిరునవ్వు నవ్వి "అలాగే విప్రులారా"  అని పడుకుని తనను రెండు భాగాలుగా కొయ్యమని భార్యను, తామ్రధ్వజుడ్ని ఆదేశిస్తాడు.  ఆ మాట విని ధర్మజుడు అతని దానగుణానికి నివ్వెరపోయాడు.  భార్య కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుని ఎడమ కంటినుంచి నీరు కారింది.  వెంటనే శ్రీకృష్ణుడు "నువ్వు బాధపడుతూ దానం చేస్తున్నావు.  కనుక మాకు వద్దు" అన్నాడు.  

  అందుకు మయూరధ్వజుడు "మహానుభావా... అది బాధ కాదు.  కుడి వైపు శరీరం దానానికి ఉపయోగపడుతున్నది.  నాకు ఆ అదృష్టం లేదు అని ఎడమ వైపు శరీరం బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది."  అన్నాడు.  

  మయూరధ్వజుడి త్యాగానికి,  దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు, ధర్మజుడు తమ నిజరూపాలను చూపించి మయూరధ్వజుడ్ని అనుగ్రహించారు.  "మయూరధ్వజా.. నీ దానగుణం నిరుపమానం.  ఏదైనా వరం కోరుకో"  అంటాడు శ్రీకృష్ణుడు.  అప్పుడు మయూరధ్వజుడు "మహాత్మా.  నా శరీరం నశించినా సరే.. నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా అనునిత్యం నీ ముందు ఉండేలా వరం ఇవ్వు" అంటాడు.  

 అప్పుడు శ్రీకృష్ణుడు "తధాస్తు...నేటినుంచి ప్రతి దేవాలయం ముందు నీపేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి.  నిన్ను దర్శించి నీ చుట్టూ ప్రదక్షణం చేసిన తరువాతే భక్తులు తమ ఇష్టదైవాలను దర్శిస్తారు.  అలాంటి భక్తుల కోరికలే నేను తీరుస్తాను.  నీ ముందు దీపం వెలిగించిన తరువాతే నా ముందు దీపం వెలిగిస్తారు." అని వరం ఇచ్చాడు.  

  గుడి లోకి వెళ్ళినపుడు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి, ప్రదక్షణలు చేసిన తరువాత చేసుకున్న దైవదర్శనమే నిజమైన దర్సనంగా అప్పటినుంచి ఆచారంగా స్ధిరపడ్డది. దేవుడు లేని దేవాలయం ఉండొచ్చు కానీ ధ్వజస్తంభం లేని దేవాలయం మాత్రం ఉండదు.  ఇది జైమినీభారతం లోని గాథ.  

                            @@@  

ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

ప్రజలసొమ్ము ను ఇష్టారాజ్యంగా దానధర్మాలకు ఉపయోగించకూడదు.  కేవలం కీర్తికాంక్ష తో దానాలు చెయ్యకూడదు.  

 ఆడినమాట తప్పకూడదు.  ప్రాణం పోతుందని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. 

ఇలాంటి నీతి కథలు పిల్లలకు బోధిస్తే వారు విలువలు నేర్చుకుని వారి బుద్ధికుశలత ధ్వజస్తంభం లా నిటారుగా నిలబడుతుంది.  ప్రతిఒక్కరూ పూజిస్తారు.

అవక్రీతుడు

అవక్రీతుడు 

@@@

 

 ఇది భారతం లోని అనేకానేక కథల్లో ఒకటి.  భారద్వాజుని కుమారుడు అవక్రీతుడు.  చిన్నప్పటినుంచి విద్యార్జనలో వెనుక పడ్డాడు.  ఇతని పొరుగునే ఉన్న రైభ్యుడు అనే ముని, ఆయన సంతానం మహా పండితులు.  వారిని చూసి ఇతనికి అసూయ పుట్టింది. చదువుకునే శ్రమ లేకుండా మహా విద్వాంసుడు కావాలని తలచి గంగానది తీరం మీద ఇంద్రుని కోసం ఘోర తపస్సు చెయ్యడం మొదలు పెట్టాడు.  

  కొన్నాళ్ళకు ఇంద్రుడు ఒక వృద్ధుని రూపం లో వచ్చి "నాయనా. విద్య అనేది గురుముఖత నేర్చుకోవాలి.  ఇలా తపస్సు చేసి అడ్డదారుల్లో కాదు.  వెళ్లి చదువుకుని సాధించు" అని సలహా ఇచ్చాడు. "లేదు.  నేను చదువుకోకుండానే నాకు అన్నీ శాస్త్రాలు, విద్యలు రావాల్సిందే.  అప్పటివరకు తపస్సు ఆపను"  అని మళ్ళీ తపస్సులో మునిగి పోయాడు.  

  కొన్నాళ్ల తరువాత మళ్ళీ ఇంద్రుడు వచ్చి హితబోధ చేసాడు.  అయినా అవక్రీతుడు వినలేదు.  అప్పుడు ఇంద్రుడు నిజరూపం తో దర్శనం ఇచ్చి అన్ని విద్యలు అతనికి సంప్రాప్తిస్తాయి అని వరం ఇచ్చి ఒక కమండలం లో మంత్రం జలం ఇచ్చి ఈ కమండలం నీ చేత ఉన్నంతవరకు అన్ని వేదం శాస్త్రాలు నీ అధీనం లో ఉంటాయి" అని వరం ఇచ్చి మాయం అయ్యాడు.  

  ఆ వర గర్వం తో అవక్రీతుడు నేరుగా రైభ్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు.  అక్కడ ఆ మహర్షి  కోడలు ఒంటరిగా కనిపించింది.  అవక్రీతుడు మోహావేశంతో  ఆమెను బలాత్కరించబోయాడు.  ఆమె అరిచి గోల చెయ్యగానే పారిపోయాడు.  రైభ్యుడు వచ్చిన తరువాత జరిగిన విషయం ఆయన తో చెప్పింది కోడలు.  రైభ్యుడు ఆగ్రహించి ఒక రాక్షసుడిని సృష్టించి ఒక సుందరాంగిగా చేసి అవక్రీతుడిని సంహరించమని ఆదేశించాడు.  ఆ మాయ సుందరాంగి అవక్రీతుడిని మెప్పించి కమండలం ఇవ్వమని కోరింది.  కామావేశం లో ఉన్న అవక్రీతుడు కమండలాన్ని ఇచ్చేసాడు.  వెంటనే సుందరాంగి రాక్షసి గా మారి అవక్రీతుడిని చంపబోయింది.  

 భయకంపితుడు అయిన అవక్రీతుడు పారిపోయి సముద్రం లోకి దూకాడు.  వెంటనే సముద్ర జలం మొత్తం ఇంకి పోయింది. అక్కడినుంచి పరుగు తీసి తండ్రి ఒక యాగం చేస్తుంటే వెళ్లి యాగాగ్ని లో దూకాడు.  వెంటనే అగ్ని హోత్రం మొత్తం చల్లబడి పోయింది.  అప్పుడు రాక్షసి అవక్రీతుడిని సంహరించింది.  

 పుత్ర శోకం తో ఉన్న భారద్వాజుని గమనించి అక్కడకు వచ్చిన ఆర్వావసువు అనే దేవత ప్రార్ధించగా  దేవతలు ప్రత్యక్షమై అవక్రీతుడిని బ్రతికించారు.  

  "అన్ని శాస్త్రవిద్యలు కలిగిన నన్ను రైభ్యుడు ఎలా చంపగలిగాడు" అని తండ్రిని ప్రశ్నించాడు.  "రైభ్యుడు గురుముఖతా శాస్త్రాలను అభ్యసించాడు.  విద్యార్జన కోసం అహర్నిశలు కష్టపడ్డాడు.  నీకు అప్పనంగా విద్య లభించింది.  అందువలన నీకు అహంకారం, మదం, మాత్సర్యం పెరిగాయి.  విచక్షణ కోల్పోయావు.  అందువల్లనే నీ విద్య నిన్ను రక్షించలేక పోయింది"  బదులిచ్చాడు భారద్వాజుడు.  

    ***** 

ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?  

విజయానికి అడ్డదారులు లేవు.  విద్యలో అయినా, వ్యాపారం లో అయినా, చిత్తశుద్ధితో అహర్నిశలు కష్టపడాలి.  అజీజ్ ప్రేమ్ జి, అంబానీ, నారాయణ మూర్తి, అక్కినేని, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉన్నత స్థాయికి  చేరుకోగలిగారు  రాత్రింబవళ్లు వారి అకుంఠిత దీక్ష ఉన్నది.  ఇవాళ స్కూల్లో చేరి, రేపటికి కేంబ్రిడ్జ్ పట్టా కావాలంటే రాదు.  ఇవాళ చిన్న వ్యాపారం మొదలు పెట్టి నెలరోజుల్లో బిర్లా, టాటా అంతవారు కావాలని ఆశపడితే కాలేవు.  

 ఇతరుల విద్య,  సంపదలు, ప్రతిష్ట చూసి అసూయ పడితే అది మనిషి పతనానికి దారి తీస్తుంది.  

 అయాచితంగా వచ్చే చదువుకు, ధనానికి విలువ ఉండదు.  పైగా మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది.  సాటి మనుషుల మీద చిన్న చూపు ఏర్పడుతుంది.  కస్టపడి పైకి వస్తే మనిషికి కష్టం విలువ, చెమట ఖరీదు తెలుస్తుంది.  అప్పుడు సమాజం లో ఎలా జీవించాలో అవగతం అవుతుంది.  

ఇదే అవక్రీతుడి చరిత్ర బోధిస్తున్న నీతి.