గురివింద నీతులు
By Murali Mohan Rao .ilapavuloori
@@@
ఎలెక్షన్ కమీషనర్ పదవీకాలాన్ని ఎలా తగ్గిస్తారు? అంటూ తెలుగుదేశం గ్యాంగ్ లీడర్ చంద్రబాబు, ఆయన ముఠాసభ్యులు బోలెడంత ఆశ్చర్యాన్ని ఒలకబోస్తున్నారు. ఎన్నికల కమీషనర్ ను తొలగించాలంటే రాష్ట్రపతికి, పార్లమెంట్ కు మాత్రమే సాధ్యం అన్నంత బిల్డప్పులు ఇస్తున్నారు.
1982 లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారిగా బ్రాహ్మణులమీద తన కక్ష తీర్చుకోవడం మొదలు పెట్టారు. ఆ కక్షలో భాగంగా 58 ఏళ్ల పదవీవిరమణ వయసును 55 ఏళ్లకు తగ్గించి వేలాదిమంది ఉద్యోగుల గొంతులు కోశారు. దాదాపు నలభై వేలమంది కరణాలు, మునసబుల పదవులను రద్దు చేసి వారి కుటుంబాల పొట్టలు కొట్టారు. ఉన్నపళాన ఉద్యోగాలు పోవడంతో దిగ్భ్రాంతులైన ఉద్యోగులు గుండెపోట్లకు, పక్షవాతాలకు గురయ్యారు. ఆడపిల్లల పెళ్లిళ్లు కుదిరిన తండ్రులు భోరున ఏడ్చారు. ఎవరిని అడిగి చేశారు?
ఇక చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక సుమారు పాతిక ప్రభుత్వ రంగ సంస్థల ఉసురు తీసి యాభైవేలమంది జీవితాలను రోడ్లమీద పడేసారు. వారంతా 58 ఏళ్ళు వచ్చేదాకా తమ జీవితాలకు ఢోకా లేదని నమ్మినవారు. వారిలో చాలామంది దిగులుతో రకరకాల వ్యాధులబారిన పడి మరణించారు. మరికొందరు పూలు అమ్మిన చోటనే కట్టెలు అమ్మినట్లు దర్జాగా ఉద్యోగాలు చేసిన చోటనే పాన్ డబ్బాలు, చిన్న చిన్న బట్టల షాపులు పెట్టుకుని భారంగా బతుకులు ఈడ్చారు.
లక్షలమంది జీవితాలను సర్వనాశనం చేసిన తెలుగుదేశం పార్టీ ఎవడో ఒక రమేష్ కుమార్ అనేవాడి పదవీ విరమణ వయసును తగ్గిస్తే ఎందుకు ఏడుస్తున్నదో వారికే తెలియాలి.
రేపు కోర్టులో విచారణ ఎలాగైనా సాగనీ, కోర్ట్ ఏమైనా చెప్పనీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు ఆదేశాలమేరకే పక్షపాతంగా వ్యవహరించనడంలో సందేహమేమీ లేదు. ఆయనకు కాలం కలిసొచ్చింది తప్ప ఆయన దురుద్దేశపూరితంగా, జగన్ ను ఇరుకున పెట్టడానికి మాత్రమే తన పదవిని దుర్వినియోగం చేశాడు. అంతగా కరోనా వ్యాప్తి అధికమై, ఎన్నికలు వాయిదా వేయాల్సివస్తే జగన్ కాదంటాడా?