చంద్రహాసుడు
@@@
ఇది జైమినీ భారతం లోని అత్యద్భుతమైన గాధ. ఒక దృశ్యకావ్యం గా మారుతుంది సినిమాగా నిర్మిస్తే.
చంద్రహాసుడు కేరళ దేశపు రాజకుమారుడు. ఇతని పసివయసులో ఇతని తండ్రి శత్రువుల చేతులో మరణిస్తాడు. ఆ వార్త వినగానే ఇతని తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎవరూ చూసేవారు లేక చంద్రహాసుడు అనాధగా మారి కుంతలదేశం వెళ్తాడు. రాజభవనం సమీపించగానే అక్కడున్న కొందరు బ్రాహ్మణులు ఇతడిని చూసి రాజలక్షణాలు కలిగిన యితడు ఎవరు? అని అక్కడున్నవారిని అడిగారు. కుంతలదేశపు మంత్రి దుష్టబుద్ధి అనేవాడు ఈ దృశ్యం చూసి "ఒకవేళ యితడు గనుక రాజకుమారుడు అయితే, ఈ దేశానికి మహారాజు అవుతాడేమో? అప్పుడు తన కుమారుడిని రాజుగా చెయ్యాలన్న కోరిక నెరవేరదు" అని భావించి తన భటులను పిలిచి ఆ బాలుడిని చంపివెయ్యమని ఆదేశిస్తాడు. ఎందుకంటే, ఆ దేశపు రాజుకు మగసంతానం లేదు. ఒకతె కూతురు. తన కొడుకు మదనుడు అనేవాడిని రాజుగారి అల్లుడిగా చేసి రాజ్యం కొట్టేయాలని అతడి పధకం.
అప్పుడు భటులు చంద్రహాసుడిని అడవికి తీసుకెళ్లి చంపడానికి మనసు ఒప్పక అతని చేతికి ఆరువేళ్ళు ఉండటం చూసి ఆరోవేలును ఖండించి వదిలేసి, దుష్టబుద్ధి కి ఆ కోసిన వేలును చూపి, చంపేశాము అని అబద్ధం చెప్తారు.
అడవిలో ఏడుస్తున్న చంద్రహాసుడిని వేటకు వచ్చిన కుళిందుడు అనే రాజు చూసి తన ఇంటికి తీసుకెళ్లి పెంచుతాడు. చంద్రహాసుడు సకల విద్యలూ నేర్చుకుంటాడు. మహావీరుడు అని పేరు తెచ్చుకున్నాడు..
ఒకరోజు దుష్టబుద్ధి తన మిత్రుడైన కుళిందుడి ఇంటికి ఒక రాచకార్యం నిమిత్తం వస్తాడు. చంద్రహాసుడిని చూసి గుర్తించి తన భటులు తనను మోసం చేసారు అని గ్రహించి మళ్ళీ ఒకపధకం వేస్తాడు. ఒక తెల్లకాగితం మీద "వీడికి విషము నిమ్ము" అని రాసి "బాబు.. అర్జెంట్ గా ఈ ఉత్తరాన్ని రాజధాని వెళ్లి నా కొడుకుకు ఇచ్చిరా" అని చంద్రహాసుడితో చెప్తాడు.
చంద్రహాసుడు వెంటనే రాజధానికి వెళ్తాడు. అక్కడ ఒక ఉద్యానవనం చూసి ముగ్ధుడై ఒక వృక్షం నీడన విశ్రమిస్తాడు. వెంటనే నిద్ర పడుతుంది. ఆ సమయం లో విహారానికి వచ్చిన దుష్టబుద్ధి కుమార్తె "విషయ" చంద్రహాసుడి అందానికి ముగ్ధురాలై చూస్తుండగా అతని జేబులో తెల్లకాగితాన్ని గమనించింది. చదవగానే ఆశ్చర్యపోయి తన తండ్రి దుర్మార్గానికి కినిసి ఉత్తరం లోని "విషము" అనే పదాన్ని "విషయ" గా దిద్దుతుంది.
నిద్ర లేచిన చంద్రహాసుడు దుష్టబుద్ధి ఇంటికివెళ్ళి మదనుడిని కలిసి ఉత్తరం ఇస్తాడు. ఉత్తరాన్ని చదివిన మదనుడు వెంటనే తన చెల్లెలిని చంద్రహాసుడికి ఇచ్చి పెళ్లి చేసాడు. మరునాడు ఇంటికి వచ్చిన దుష్టబుద్ధి తన పధకం వికటించిన సంగతి గ్రహించి ఖేదమనస్కుడై చేసేది ఏమీ లేక "అల్లుడూ... మా ఇంటి ఆచారం ప్రకారం పెళ్లి అయిన తరువాత కాళీకాలయానికి వెళ్లి ఫలానా పూవులు సమర్పించి రావాలి. కనుక నువ్వు వెళ్లి పూవులు సమర్పించి రా" అని చంద్రహాసుడుతో చెప్పాడు.
చంద్రహాసుడు వెళ్ళగానే తన భటులను పిలిచి "కాళికాలయానికి ఒంటరిగా ఎవరు వచ్చినా తక్షణమే వాడి శిరస్సును ఖండించండి" అని చెప్తాడు. భటులు ఆలయానికి వెళ్ళారు ఆలయానికి వెళ్తున్న చంద్రహాసుడిని రాజుగారు రమ్మని కబురు చేస్తారు. అప్పుడు మదనుడు వచ్చి "ఆలయానికి నేను వెళ్తాను. నువ్వు రాజుగారిని కలిసి రా" అని తాను ఆలయానికి వెళ్తాడు. చీకట్లో ఒంటరిగా ఆలయానికి వచ్చిన మదనుడిని గుర్తించలేక భటులు మదనుని శిరస్సును ఖండిస్తారు.
చంద్రహాసుడిని చూసిరాజు ఆతను తన మిత్రుడు కేరళ రాజు కుమారుడు అని తెలుసుకుని తన కుమార్తె నిచ్చి వివాహం చేస్తాడు.
తన కొడుకు చావడం, రాజకుమారిని చంద్రహాసుడు పెళ్లి చేసుకోవడం చూసిన దుష్టబుద్ధి గుండె బద్దలై మరణిస్తాడు.
వివాహం అనంతరం ఆలయానికి వెళ్లిన చంద్రహాసుడు అక్కడ మదనుడి శవం చూస్తాడు. అపుడే దుస్టబుద్ధి మరణించిన విషయం కూడా తెలుస్తుంది. కాళికా దేవుని ప్రార్ధించి ప్రత్యక్ష్యం చేసుకుని తండ్రి కొడుకులను బ్రతికిస్తాడు చంద్రహాసుడు.
@@@
పై కథను చదివి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?
మనం మంచివాళ్ళం, పవిత్రులం అయితే, మనలను అభాసుపాలు చెయ్యడానికి ఎందరు కుయుక్తులు పన్నినా, మన మీద ఎన్ని కుట్రలు చేసినా, కనిపించని దైవం మనలను కాపాడుతుంది. ఇతరులకు ఉపకారం చెయ్యడం, మనసులో కుళ్ళు కుతంత్రాలు చేరకుండా మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. పరాయివారికి మేలు చేసే సద్బుద్ధి మనకుంటే, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మనకు భగవంతుడే మేలు చేస్తాడు. అందుకే ప్రతి వారూ మంచి నడతను అలవరచుకోవాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి