మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనేది తెలుగులో ప్రాచుర్యం కలిగిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర గీతంగా అధికారికంగా స్వీకరించబడిన ఒక గేయం. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. ఈ గేయంలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు.
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
విశేషాలు
* ప్రఖ్యాత గాయిని, నటి టంగుటూరి సూర్యకుమారి ఆలాపన ద్వారా అప్పటిలో ఈ గేయం బాగా జనాదరణ పొందింది.
* సుప్రసిధ్ధ దర్శకుడు బాపు, బుల్లెట్ చిత్రం కోసం ఈ పాటను బాలసుబ్రమణ్యం తో పాడించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి