"ఇళయరాజా"
‘చిత్రగాన కల్పవృక్షానికి ఫలపుష్పభరితమైన కొమ్మలెన్నో, అందులో ఇళయరాజా ఒక చిటారుకొమ్మ. ‘‘నాభిహృత్కంఠ రసనల ద్వారా ఉద్భవించి ఉరికివచ్చే సప్తస్వర సుందరులను భజించిన నాదయోగులలో ఇళయరాజా ఒకరు’’ అంటూ వేటూరి సుందరరామమూర్తి ఇళయరాజాను కీర్తించారు. ‘‘సహజమైన సంప్రదాయ వాద్యపరికరాలతో సంగీతం సమకూర్చితే అందులో మనకు ఆత్మ కనిపిస్తుంది. యంత్రాలతో సంగీతం అంటే ఎప్పుడూ యాంత్రికంగానే వుంటుంది. యాదృచ్చికంగా వచ్చేదే సంగీతం. దానికో సమయం అంటూ వుండదు. అప్పుడే పుట్టిన పసిపాపలా ఉండేదే సంగీతమంటే. వినగానే కొత్తగా వుండాలి... వినే శ్రోతకి కొత్త అనుభూతిని పంచాలి’’ అనేది ఇళయరాజా నమ్మిన సిద్ధాంతం. మనసుకు నచ్చని పని ఇళయరాజా ఎప్పుడూ చెయ్యలేదు. హింసానేపథ్యంతో వుండే ఒక కథను కమలహాసన్ వినిపిస్తే రాజా ఆ సినిమాకు సంగీతం చెయ్యలేనని చెప్పాడు. తనను ఒప్పించలేని కథకు రాజా సంగీతం ఇవ్వలేదు. అటువంటి సంగీత మేస్ట్రో ఇళయరాజా రాజా గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం...
*ఎవరు వీరు?
అది మద్రాసు నగరం రాయపేటలోని ముత్తుమొదలి వీధి. ఆ వీధి చివర ఒక చిన్న గదిలో అల్లినగరం చిన్నసామి అనే యువకుడు ఉండేవాడు. దగ్గరలోని పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తూ సినిమా ప్రయత్నాలు సాగిస్తూ ఉండేవాడు. 1968లో ఒకరోజు తలవని తలంపుగా ముగ్గురు అన్నదమ్ములు ఆ చిన్నసామి గదికి వచ్చారు. మదురై పరిసర ప్రాంతాల్లో చిన్నసామి నాటక ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఈ ముగ్గురూ సంగీతం అందించేవారు. ఆ సోదరుల్లో పెద్దవాడిని ‘మద్రాసు వచ్చిన కారణం ఏమిటి?’ అని ప్రశ్నిస్తే, ‘సినిమాల్లో మ్యూజిక్ చెయ్యాలని వచ్చా’మని చెప్పాడు. చిన్నసామికి ఆశ్చర్యమేసింది. సినిమాలకు సంగీతం కూర్చడమంటే వాళ్లు అనుకున్నంత సులువు కాదని అతనికి తెలుసు. కానీ ఆ సోదరుల పట్టుదల నచ్చింది. ఆపై ఆ ముగ్గురూ వివిధ రకాల వాద్యపరికరాలపై సాధన చేస్తూనే చిన్నచిన్న నాటకాలకు వాద్యసహకారం అందిస్తూ కాలం గడపసాగారు. ఉన్నరోజు తిని, లేనిరోజు పస్తులుండడం అలవాటు చేసుకున్నారు. వీరి అవస్థ గమనించిన చిన్నసామి వారికి ఒక గాయకునికి పరిచయం చేశాడు. ఆ గాయకునికి ఒక ఆర్కెస్ట్రా బృందం వుండేది. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు అతడు పాటకచేరిలు నిర్వహించేవాడు. ఆ గాయకుడు మరెవరోకాదు. సినీ సంగీత నిధి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆ చిన్నసామి కూడా ఎవరో కాదు ప్రఖ్యాత దర్శకనిర్మాత భారతీరాజా. ఆ ముగ్గురిలో పెద్దవాడు కూడా మరెవరో కాదు ఇసైజ్ఞాని ఇళయరాజా. ఆ మిగతా ఇద్దరూ రాజా సోదరులు గంగై అమరన్, భాస్కర్లు. బాలు ఇళయరాజాను ‘సంగీతం వచ్చా?’ అని అడిగారు. ‘నేర్చుకోలేదు. కానీ హార్మోనియం వాయిస్తాను’ అని బదులిచ్చాడు రాజా. బాలు అడిగిందే తడవు, రాజా హార్మోనియం అందుకొని డాక్టర్ ఝివాగో చిత్రంలోని లారా థీమ్ మ్యూజిక్ వాయించి ఆశ్చర్యపరచాడు. ఎందుకంటే ఆ థీమ్ మ్యూజిక్ అత్యంత క్లిష్టమైనది కనుక. ‘సంగీత జ్ఞానం లేకుండా ఎలా వాయించగలిగావు?’ అని బాలు ప్రశ్నిస్తే, ‘మ్యూజిక్ విని వాయించాను’ అని రాజా ఇచ్చిన సమాధానం బాలుకు మతిపోయేలా చేసింది. రాజా హార్మోనిస్టుగా, గంగై అమరన్ గిటారిస్టుగా, భాస్కర్ డ్రమ్మర్గా వాళ్లు బాలు ట్రూప్లో చేరిపోయారు. బాలు గాయకునిగా సినిమాల్లో స్థిరపడిన తరవాత ఇళయరాజా ‘పావలార్ బ్రదర్స్’ పేరుతో కొన్ని వందల కచేరీలు చేశాడు. తరవాత పాశ్చాత్య సంగీతంలో మెళకువలు నేర్చుకోవాలని ధన్రాజ్ మాస్టర్ వద్ద చేరి, వెస్ట్రన్ సంగీతంతోబాటు నొటేషన్లు రాయడం కూడా నేర్చుకున్నాడు. ధన్రాజ్ మాస్టర్ రాజా నైపుణ్యాన్ని, గ్రహణ శక్తిని చూసి సంగీత దర్శకుడు జి.కె.వెంకటేష్ వద్ద సహాయకునిగా కుదిర్చాడు. అక్కడ 1969 నుంచి 1974 వరకు దాదాపు వంద సినిమాలకు పైగా రాజా సహాయకుడిగా పనిచేశాడు.
*
రాళ్లెత్తిన కూలీ
ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. తమిళనాడులోని తెన్ని జిల్లా పణై¬్నపురంలో జూన్ 2, 1943న జన్మించాడు. తండ్రి రామస్వామి, తల్లి చిన్నత్తాయమ్మాళ్. వారిది తమిళనాడు− కేరళ సరిహద్దు గ్రామం కావడంతో రామసామి కేరళ తేయాకు తోటల్లో సూపర్వైజర్గా పనిచేసేవాడు. అతనిపై అధికారి ఆంగ్లేయ దొర. అతని ప్రోద్బలంతో రామసామి క్రైస్తవ మతం స్వీకరించాడు. అప్పుడు జ్ఞానదేశికన్ పేరును డేనియల్ రాజయ్య (రాజా)గా మార్చాడు. రాజా తన మేనమామ ఇంటివద్ద ఉంటూ చదువుకోసాగాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో చదువుకు స్వస్తి చెప్పి కూలీ పనిచేశాడు. మదురైలో వైగై నది మీద ఆనకట్ట నిర్మాణం జరిగినప్పుడు, ఆ ఆనకట్ట కోసం రాళ్లెత్తిన కూలీలలో రాజయ్య కూడా ఒకడు. అప్పుడే వ్యవసాయ కూలీలు పాడుకొనే ఏలపాటలు, కార్మికులు పాడుకొనే జానపద గీతాలు రాజయ్యకు కంఠోపాఠమయ్యాయి. రాజా పాడడం గమనించిన ఒక ఇంజనీర్ అతన్ని తన వద్ద నౌకరుగా నియమించుకొని వారానికి 7 రూపాయల జీతం ఇచ్చేవాడు. ఈ రోజు కోట్లకు పడగెత్తినా తన మొదటి సంపాదన ఇచ్చిన ఆనందం మరచిపోలేనిదని అంటుంటారు ఇళయరాజా. తరవాత కమ్యూనిస్టు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ప్రజలను ఉత్తేజపరచేలా రాజా పాటలు పాడేవాడు.
*ఇళయరాజాగా మారిన డేనియల్ రాజా
జి.కె. వెంకటేష్ బృందంలో రాజాతోబాటు ప్రఖ్యాత వయోలిన్ వాద్యకారుడు ఎల్.వైద్యనాధన్ కూడా సహాయకుడిగా పనిచేస్తుండేవాడు. 1974లో జి.కె. వెంకటేష్ సంగీత విభావరి మైసూరులో జరిగింది. అప్పుడు రాజా జ్వరాన పడ్డాడు. వైద్యనాధన్ రాజాను మెల్లిగా కొల్లూరులోని మూకాంబిక ఆలయానికి తీసుకెళ్లాడు. సౌపర్నికా నదిలో స్నానంచేసి మూకాంబికా మాతను దర్శనం చేకోగానే రాజా జ్వరం క్షణంలో మాయమైంది. సరస్వతి మంటపంలో కూర్చొని వైద్యనాధన్ వయోలిన్ వాయిస్తుండగా, రాజా రెండు కీర్తనలు ఆలపించాడు. అప్పుడు ఆలయ పూజారి గణపతిభట్ రాజా పేరును ‘ఇళయరాజా’ (యువరాజు అని అర్ధం)గా మార్చాడు. మూకాంబికా మాత దర్శనం తరవాత ఇళయరాజా ఆహార్యంలో మార్పు వచ్చింది. జుబ్బా, అడ్డపంచకు ఆయన పరిమితమయ్యాడు.
*సంగీత దర్శకునిగా రాజా తొలి అడుగులు
ఇళయరాజాకు ‘దీపం’ అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించే అవకాశం వచ్చినా దాని నిర్మాణం ఆగిపోయింది. జెమినీ సంస్థ చిత్రానికి సంగీతం అందించే అవకాశం అందినట్లే అంది దక్కకుండా పోయింది. 1976లో పంజు అరుణాచలం అనే నిర్మాత గ్రామీణ నేపథ్యంలో ‘అణ్ణక్కిళి’ సినిమా నిర్మిస్తూ ఇళయరాజాకు తొలి అవకాశం ఇచ్చాడు. శివకుమార్, సుజాత నటించిన ఆ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం వినూత్నంగా, విభిన్నంగానూ వుండడంతో సంగీతాభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అందులో ఎస్.జానకి ఆలపించిన ‘మచ్చానై పార్తింగళా మలైవాళ తోప్పుక్కుళ్ళే’ (తెలుగులో ‘మావయ్య వస్తాడంటా మనసిచ్చి పోతాడంటా’− రామచిలక సినిమాలో) పాటకు ప్రేక్షకులు లేచి నిలబడి డ్యాన్స్ చేసేవారు. పియానో, గిటార్ వంటి పాశ్చాత్య వాద్య పరికరాలమీద హంసధ్వని, రీతి గౌళ, మోహన వంటి కర్నాటక సంప్రదాయ రాగాలను మేళవించి స్వరపరచడంతో సంగీత ప్రియులకు ఏదో కొత్తదనం గోచరించి, క్రమంగా రాజాకు అభిమానులై పోయారు. ‘నిళల్గళ్’ ‘ఆరిళిరిందు అరువత్తువరై’, ‘నేట్రికన్’, ‘మూదుపాణి’, ‘నింజతై కిలాత్తే’ వంటి సినిమాల్లోని పాటలు సూపర్ హిట్లుగా నిలవడంతో రాజా పేరు తమిళనాట మారుమ్రోగిపోయింది. భారతీరాజా−ఇళయరాజా కాంబినేషన్లో ఎంతో అద్భుతమైన పాటలు వచ్చాయి.
*తెలుగు తెరమీద ఇళయరాజీయం
ఇళయరాజా 1977లో వచ్చిన ‘భద్రకాళి’ సినిమాతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు. అందులో జేసుదాస్, సుశీల ఆలపించిన ‘చిన్నిచిన్ని కన్నయ్యా’ పాట తెలుగు ప్రేక్షకులను అలరించింది. తర్వాత వచ్చిన ‘వయసు పిలిచింది’ సినిమాలోని అన్ని పాటలూ యువతరానికి కొత్త సంగీత టానిక్ను ఎక్కించి మత్తులోకి నెట్టేశాయి. హిందీలో విజయవంతమైన ‘డాన్’ సినిమాను మేకప్ ఆర్టిస్టు పీతాంబరం తెలుగులో ‘యుగంధర్’ పేరుతో నిర్మిస్తే, ఇళయరాజా తనదైన శైలిలో సంగీతం అందించి ఆ సినిమాను సూపర్ హిట్ చేశారు. ఎర్రగులాబీలు, అజేయుడు, పంచభూతాలు, కాళరాత్రి సినిమాలలోని పాటలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక 1981లో వచ్చిన సీతాకోకచిలక సినిమా పాటలు సంగీత అభిమానులను ఇళయరాజా మత్తులోకి దించేశాయి. ‘వసంతకోకిల’, ‘అమరగీతం’, ‘మధురగీతం’, ‘టిక్ టిక్ టిక్’, ‘పూలపల్లకి’, ‘కొత్త జీవితాలు’ సినిమాలలో పాటలు మారుమ్రోగిపోయాయి. సరికొత్త బాణీలు, వైవిధ్యభరిత సంగీతం యువతరాన్ని గంగవెర్రులెత్తించింది. ‘శివ’, ‘సాగరసంగమం’, ‘అభిలాష’, ’రాజకుమార్’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘సంకీర్తన’ వంటి సినిమాలలోని పాటల సంగతి చెప్పాల్సిన పనేలేదు. 1984లో దర్శకుడు వంశీతో ఇళయరాజాకు పరిచయమైంది. ‘సితార’ సినిమా అతనికి రెండవచిత్రం. రీరికార్డింగ్ కాకుండా డబుల్ పాజిటివ్ వేసి చూపిస్తే శ్రేయోభిలాషులు పెదవి విరిచారు. వంశీ నిరాశ చెందాడు. ఇళయరాజా దానికి రీ రికార్డింగ్ చేసి విడుదలచేస్తే ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక వంశీ సినిమాలు ‘లేడీస్ టైలర్’, ‘అన్వేషణ’, ‘ప్రేమించు−పెళ్లాడు’, ‘మహర్షి’, ‘చెట్టుకింద ప్లీడర్’, ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘శ్రీ కనక మహాలక్ష్మి డ్యాన్స్ ట్రౌపే అన్నీ సంగీతపరంగా సూపర్ హిట్లే. ‘ఛాలెంజ్’, ‘మాంగల్యబంధం’, ‘గీతాంజలి’, ‘శ్రీషిర్డీ సాయిబాబా మహాత్మ్యం’, ‘జ్వాల’, ‘రాక్షసుడు’, ‘ఒక రాధ ఇద్దరుకృష్ణులు’ పెద్ద హిట్ సినిమాలు. ‘శివ’ సినిమాకు ఇళయరాజా వినూత్నమైన సంగీతాన్ని అందించారు. సినిమా విజయవంతం కాదని తనకు అనిపించిన సందర్భాల్లో, ఇళయరాజా నిర్మాతల్ని రీరికార్డింగ్ వంటి పనులకు ఎక్కువగా ఖర్చు పెట్టనిచ్చేవారు కాదు. 1988 తర్వాత విడుదలైన సినిమాలలో ఇళయరాజా సంగీత పోకడలు కొత్త పుంతలు తొక్కాయి. ‘రక్తాభిషేకం’, ‘జమదగ్ని’, ‘వారసుడొచ్చాడు’, ‘అభినందన’, ‘రుద్రవీణ’, ‘ఆఖరి పోరాటం’,‘స్వర్ణకమలం’, ‘మరణమృదంగం’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘ప్రేమ’, ‘విచిత్ర సోదరులు’, ‘బొబ్బిలిరాజా’, ‘కొండవీటి దొంగ’, ‘కూలీ నెంబర్ 1’, ‘ఆదిత్య 369’, ‘అంజలి’, ‘ఓ పాపా లాలి’, ‘స్వాతిముత్యం’, ‘తూర్పు సింధూరం’ వాటిలో కొన్ని మాత్రమే. తమిళనాడులో సినిమా విడుదల రోజున హీరోలతో సమానంగా ఇళయరాజా కటవుట్లు వెలిసేవి. మ్యూజిక్ షాపులు ఇళయరాజా పాటలు కొనేవాళ్లతో నిండిపోయేవి. భారతీరాజా తొలిచిత్రం ‘పదునారు వయదినిలే’ (పరహారేళ్ళ వయసు)లో ఉత్తమ గాయనిగా ఎస్. జానకికి జాతీయ పురస్కారం లభించింది ఇళయరాజా సంగీత దర్శకత్వంలోనే. అలాగే గాయని చిత్రకు తొలి జాతీయ పురస్కారాన్ని తెచ్చి పెట్టిన ‘సింధుభైరవి’ చిత్రానికి సంగీతం సమకూర్చింది కూడా ఇళయరాజానే. రాజా పాటల పల్లవులు ఉటంకించాలంటే స్థలం చాలని పరిస్థితి.
మరిన్ని విశేషాలు
* 2005లో ఆసియా ఖండం నుంచి అఖండ వాద్యబృందంతో లండన్లోని రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో సింఫనీ నిర్వహించిన తొలి సంగీత దర్శకుడిగా ఇళయరాజా పేరు చరిత్రపుటలకెక్కింది. ‘తిరు వానగం’ పేరుతో నిర్వహించిన ఈ సింఫనీ ప్రాచీన తమిళ సంప్రదాయ సాహిత్య నేపథ్యంగా సాగింది. ఐదుసార్లు గ్రామీ పురస్కారం అందుకున్న సౌండ్ ఇంజనీర్ రిచర్డ్ కింగ్, ఆస్కార్ పురుస్కార గ్రహీత స్టీఫెన్ షెనార్ట్ రాజా వాద్యబృందంలో వుండి సింఫనీకి సహకరించడం, రాజాకు గొప్ప అనుభూతినిచ్చింది.
* ‘పంచముఖి’ పురుతో కొత్తరాగాన్ని సృశించిన ఘనత కూడా ఇళయరాజాదే.
* లండన్ నగరంలోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి బంగారు పతకం సాధించిన సంగీత స్రష్ట (ఇసైజ్ఞాని) ఇళయరాజా.
* ఇళయరాజా సంగీతం అందించిన సాగరసంగమం (తెలుగు), సింధుభైరవి (తమిళం), రుద్రవీణ (తెలుగు), కేరళవర్మ పళస్సిరాజా (మళయాళం) చిత్రాలకు జాతీయస్థాయిలో ఇళయరాజా ఉత్తమ సంగీత దర్శకుని బహుమతులు అందుకున్నారు. సీతాకోకచిలక, రుద్రవీణ, జగదేకవీరుడు − అతిలోక సుందరి, శ్రీరామరాజ్యం సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతులు, ఆరుసార్లు తమిళ చిత్ర ఉత్తమ సంగీత దర్శకుని బహుమతులు ఇళయరాజాకు దక్కాయి. మూడు కేరళ ప్రభుత్వ బహుమతులు, రెండు ఫిలింఫేర్ బహుమతులు కూడా ఇళయరాజా పుచ్చుకున్నారు. 1988లో తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘కళైమామణి’ బిరుదుతో రాజాను సత్కరించింది. 2010లో రాజాను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
* ప్రేమించు పెళ్ళాడు చిత్రానికి దరువు లేకుండా కేవలం గిటార్ తంత్రిని మీటి పాట రాయమని వేటూరిని కోరారు. సన్నివేశానికి అదే మ్యూజిక్ బిట్ అవుతుందని కూడా చెప్పారు. అలా వెలువడిందే ‘గోపెమ్మ చేతిలో గోరుముద్ద.....రాధమ్మ చేతిలో వెన్నముద్ద’ పాట.
* తన సంగీత గురువు జి.కె. వెంకటేష్కు అవకాశాలు తగ్గిన రోజుల్లో తన వద్ద వుంచుకుని ప్రతీరోజూ తొలి గౌరవ పారితోషికాన్ని అతనికి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్న మహామనిషి ఇళయరాజా.
🎻🎻🎻
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి